- పోడు భూములకు పట్టాల సంగతేమైందని నిలదీత
- అనర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నా పట్టించుకోవట్లేదని ఆగ్రహం
- మీటింగ్కు నలుగురు ఎమ్మెల్యేలు దూరం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: హెల్త్, ఫారెస్ట్ ఆఫీసర్ల తీరుపై ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ఫారెస్ట్ వాళ్లేమో గిరిజనులను వేధిస్తుంటే, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్లేమో ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని అసహనం వ్యక్తం చేశారు. అధికార, ప్రతిపక్ష ప్రతినిధులు ఆఫీసర్లను నిలదీయడంతో మంగళవారం చైర్మన్ కోరం కనకయ్య అధ్యక్షతన జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ గరంగరంగా జరిగింది. అనర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసినా ఆఫీసర్లు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీటింగ్కు నలుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.
ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ 2005కు ముందు నుంచి పోడు భూములు సాగు చేస్తున్న వారికి పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మణుగూరు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. డాక్టర్ల నియామకాలకు చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ సీజన్ మొదలవుతున్న తరుణంలో పోడు భూముల్లో హరితహారం పేర రైతులను వేధించవద్దని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఫారెస్ట్ అధికారులకు సూచించారు. ఇల్లందు మండలం సీతానగరానికి చెందిన గిరిజనులు బోర్లు వేయించుకున్నారని, కరెంట్ కనెక్షన్ ఇవ్వకుండా ఫారెస్ట్ వాళ్లు అడ్డుకోవడం దారుణమన్నారు. వారం కిందట చెట్టుపల్లి ప్రాంతంలో ఫారెస్ట్ ఆఫీసర్లు గిరిజనులను వేధిస్తున్నారని ఎంపీపీ ముక్తి సత్యం వాపోయారు.
జడ్పీ మీటింగ్లలో చర్చించుకోవడం తప్ప అమలులో ఫారెస్ట్ ఆఫీసర్లు వేరేలా వ్యవహరిస్తున్నారని జడ్పీటీసీలు మేరెడ్డి వసంత, సున్నం నాగమణి, పి వెంకటేశ్వర్లు ఆరోపించారు. రెవెన్యూ, ఫారెస్ట్ భూముల వివాదాన్ని పరిష్కరించకపోవడంతోనే గొడవలు జరుగుతున్నాయని జడ్పీటీసీ వెంకటరెడ్డి అన్నారు. ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్లో ఫారెస్ట్ వాళ్లు మొక్కలు నాటడం ఏమిటని ప్రశ్నించారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో ఫారెస్ట్ సిబ్బంది గిరిజన మహిళలపై దాడి చేయడంతో పాటు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్డీవో అబ్బయ్య మాట్లాడుతూ గతంలో ఏర్పాటు చేసిన ట్రెంచ్ లోపలే హరితహారం మొక్కలు నాటుతామని తెలిపారు. వైద్య శాఖపై ప్రతీ మీటింగ్లో చర్చించుకుంటున్నా ఎలాంటి మార్పు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. చండ్రుగొండ మండలంలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేసుకుంటే కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకొస్తే పట్టించుకొనే వారే కరువయ్యారని జడ్పీటీసీ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించారు. ఆసుపత్రికి వచ్చిన వాళ్లను ప్రైవేట్ హాస్పిటల్స్కు ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. అశ్వారావుపేట హాస్పిటల్కు ఎంపీ నామా నాగేశ్వరరావు అంబులెన్స్ ఇచ్చినా డ్రైవర్ లేకపోవడంతో నిరుపయోగంగా మారిందని తెలిపారు. 104 సిబ్బందికి సంబంధించి రూ.60 లక్షల పీఎఫ్ డబ్బులు గోల్ మాల్ అయ్యాయని జడ్పీ మీటింగ్లో ఆఫీసర్ల దృష్టికి తెచ్చినా స్పందించడం లేదని మండిపడ్డారు. హాస్పిటల్స్లలో పర్మినెంట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఎంత మంది పని చేస్తున్నారనే వివరాలు అడిగినా, ఇవ్వడం లేదని జడ్పీ చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చండ్రుగొండ పంచాయతీలో డబుల్ బెడ్రూం ఇండ్లలో అనర్హులున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని వాపోయారు. అడిషనల్ కలెక్టర్ కె వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో విద్యాలత, జడ్పీ వైస్చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, లైబ్రరీ చైర్మన్ దిండిగాల రాజేందర్పాల్గొన్నారు.
ఎమ్మెల్యేల గైర్హాజరు
జడ్పీ మీటింగ్కు ఐటీడీఏ పీవోతో పాటు కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట, భద్రాచలం ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, బానోత్ హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, పొదెం వీరయ్య రాకపోవడం పట్ల పలువురు జడ్పీ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొనే జడ్పీ మీటింగ్కు ఎమ్మెల్యేలు దూరంగా ఉండడం సరైంది కాదన్నారు. ఇదిలాఉంటే కొత్తగూడెం ఎమ్మెల్యే జడ్పీ ఆఫీస్సమీపంలో జరిగిన ఓ ప్రైవేట్ ప్రోగ్రాంలో పాల్గొని, జడ్పీ మీటింగ్కు రాకపోవడంపై పలువురు చర్చించుకోవడం కనిపించింది.