- రెస్క్యూ ఆపరేషన్లతో రక్షిస్తున్న సిబ్బంది
- టర్కీ, సిరియాలో మృతులు 28వేల మంది
- కొనసాగుతున్న సహాయక చర్యలు
- యూట్యూబర్ ను గుర్తించి, కాపాడిన రెస్క్యూ సిబ్బంది
అంటాక్యా (టర్కీ): సిరియా, టర్కీని భూకంపం కుదిపేసి వారం రోజులవుతున్నది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటికి తీసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారు. కూలిన సిమెంట్ దిమ్మెల కింద ఇరుక్కుపోయిన వారు తమ మొబైల్ను ఉపయోగించి, సోషల్ మీడియా ద్వారా సాయం కోరుతూ ప్రాణాలు కాపాడుకుంటున్నారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దీంతో వారిని గుర్తించి రెస్క్యూ సిబ్బంది సేఫ్గా బయటికి తీస్తున్నారు. ఇస్తాంబుల్కు చెందిన 20 ఏండ్ల బిరాన్ కుబాత్, వాట్సాప్తో ప్రాణాలు దక్కించుకున్నాడు. భూకంపం తర్వా త కుబాత్ బండ రాళ్ల కింద చిక్కుకుపోయాడు. ఫోన్ తనవద్దే ఉండటంతో వీడియో తీసి వాట్సాప్ స్టేటస్లో పెట్టాడు. ‘‘ఎవరైనా ఈ స్టేటస్ చూస్తుంటే ప్లీజ్.. నన్ను కాపాడండి. బండరాళ్ల కింద ఇరుక్కుపోయా. హెల్ప్ చేయండి” అంటూ స్టేటస్ పెట్టడంతో రెస్క్యూ సిబ్బంది అతడున్న ప్రాంతాన్ని గుర్తించి కుబాత్ను కాపాడారు. కుబాత్ తల్లిని బయటికి తీశారు. మరో ఘటనలో ఓ యూట్యూబర్ ఫిరత్ యాయ్లా ప్రాణాలు కాపాడుకున్నాడు. ‘‘ఫ్రెండ్స్ మేము బండ రాళ్ల మధ్య చిక్కుకున్నాం. ప్లీజ్ హెల్ప్ చేయండి” అని అడ్రస్ చెబుతూ ఇన్స్టాలో కోరాడు. ఇది చూసి రెస్క్యూ సిబ్బంది ఫిరత్ను కాపా డారు. ఇలా కొందరు సోషల్ మీడియాతో బయటపడుతున్నారు.
తినడానికి తిండి లేదు
భూకంప బాధితుల కోసం అక్కడి ప్రభుత్వం గాజియెన్టెప్లోని మున్సిపల్ స్టేడియంలో టెంపరరీ క్యాంపులు ఏర్పాటు చేసినా సౌలత్లు లేవు. ఫుడ్, వాటర్, బ్లాంకెట్లు, స్వెటర్లు లేకపోవడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా కష్టపడుతున్నారు. ‘గ్యాస్, హీటింగ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ లేదు. ఏమైనా కొందామన్న డబ్బుల్లేవు. కార్డులన్నీ శిథిలాల కిందే ఉండిపోయాయి, ప్రభుత్వ సాయం మా దాకా రావడంలేదు. గంటల తరబడి లైన్లో నిలుచున్నా ఫుడ్ దొరకట్లే’ అని మాజీ సైనికుడు ఒకరు చెప్పారు. బాత్రూం వెళ్లాలన్నా లైన్లో నిలబడాల్సి వస్తున్నది. కొందరు కార్లలోనే పడుకుంటున్నారు. వేరే దేశం వెళ్లిపోదామన్నా.. గుర్తింపు కార్డుల్లేవు. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు.
టర్కీకి ఇండియన్ ఏడో కార్గో విమానం
ఆపరేషన్ దోస్త్లో భాగంగా నిత్యావసర వస్తువులతో కూడిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఏడో విమానం ఆదివారం అదానాలో ల్యాండ్ అయ్యింది. ఇందులో మందులు, నిత్యావసరాలు పంపించినట్లు మన విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.
నర్సుల ధైర్యానికి హ్యాట్సాఫ్
టర్కీ భూకంపానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. హాస్పిటల్ ఐసీయూలో చిన్నారులతో ఉన్న ఇంక్యుబేటర్లు కిందపడకుండా ఇద్దరు నర్సులు గట్టిగా పట్టుకున్నారు. తమ ప్రాణాలను లెక్కజేయకుండా చిన్నారులను కాపాడారు. ఇదంతా గాజియెన్టెప్లోని ఓ హాస్పిటల్ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. నర్సులు డెవ్లెట్ నిజాం, గజ్వల్ కాలిస్కాన్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మృతులు 29 వేల మంది..
టర్కీ, సిరియాలో మృతుల సంఖ్య 29వేలు దాటింది. టర్కీలోనే 26వేల మందికి పైగా చనిపోగా 80వేల మంది గాయపడ్డారు. సిరియాలో 4 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాల్లో 50 లక్షల మందికి పైగా నిరాశ్రయిలయ్యారు. 2 లక్షల మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. కుప్పకూలిన బిల్డింగ్లకు సంబంధించిన 113 మందిపై టర్కీ పోలీసులు అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. 12 మందిని కస్టడీలోకి తీసుకున్నారు.