- క్రెడిట్ కార్డులను ఇవ్వడంపైనా నిషేధమే..
- తరచూ టెక్నికల్ సమస్యలు రావడం వల్లనే
న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంక్కు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) షాకిచ్చింది. బ్యాంక్ ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) మేనేజ్మెంట్లో లోపాలు ఉండడంతో ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడాన్ని నిషేధించింది. అంతేకాకుండా కొత్తగా క్రెడిట్ కార్డులను ఇష్యూ చేయడాన్ని కూడా బ్యాన్ చేసింది. ఈ నిర్ణయాలు వెంటనే అమల్లోకి వచ్చాయి. కోటక్ బ్యాంక్ ఐటీ విభాగాలను 2022, 2023 లో పరిశీలించామని, టెక్నికల్ సమస్యలను టైమ్కి పరిష్కరించడంలో బ్యాంక్ ఫెయిలవుతోందని ఆర్బీఐ పేర్కొంది.
టెక్నికల్ సమస్యల కారణంగా కొత్తగా క్రెడిట్ కార్డులను ఇష్యూ చేయకుండా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పై 2020 లో ఆర్బీఐ రిస్ట్రిక్షన్లు పెట్టిన విషయం తెలిసిందే. 2022 మార్చిలో ఈ రిస్ట్రిక్షన్లు ఎత్తేసింది. ఐటీ మేనేజ్మెంట్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, కస్టమర్ల డేటా దొంగతనానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆర్బీఐ ఆరోపించింది. ఏదైనా సమస్య వస్తే వెంటనే రికవరీ అవ్వడానికి ఎటువంటి స్ట్రాటజీ లేదని, డేటా సెక్యూరిటీలో లోపాలు ఉన్నాయని తెలిపింది.
ఆన్లైన్ మార్గాల్లో కొత్త కస్టమర్లను చేర్చుకోవడాన్ని నిలిపివేసినా, ఇప్పటికే ఉన్న కస్టమర్లకు బ్యాంక్ తన సర్వీస్లను అందించొచ్చు. క్రెడిట్ కార్డ్ కస్టమర్లు కూడా ఇందులో ఉన్నారు. వరుసగా రెండు సంవత్సరాల్లో జరిగిన దర్యాప్తుల్లో కోటక్ బ్యాంక్ ఫెయిలయ్యింది. ఐటీ రిస్క్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గవర్నెన్స్ రూల్స్ను ఫాలో కావడంలో లోపాలు ఉన్నాయి.
ఆర్బీఐ విడుదల చేసిన యాక్షన్ ప్లాన్ను 2022, 2023 లో కోటక్ బ్యాంక్ సరిగ్గా ఫాలో కాలేకపోయింది. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ , ఐటీ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ మెరుగ్గా లేకపోవడంతో కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (సీబీఎస్), ఆన్లైన్, డిజిటల్ బ్యాంకింగ్ ఛానల్స్ గత రెండేళ్లలో తరచూ టెక్నికల్ సమస్యలను ఎదుర్కొన్నాయని ఆర్బీఐ పేర్కొంది. తాజాగా ఈ ఏడాది ఏప్రిల్ 15 న కోటక్ బ్యాంక్ టెక్నికల్ సమస్యలను ఎదుర్కొందని, కస్టమర్లు ఇబ్బందులకు గురయ్యారని తెలిపింది. గత రెండేళ్లుగా ఇటువంటి సమస్యలపై బ్యాంక్తో చర్చలు జరుపుతున్నామని, అయినప్పటికీ రిజల్ట్స్లో మాత్రం పెద్దగా మార్పు లేదని పేర్కొంది.
రిజల్ట్స్ ముందు రిస్ట్రిక్షన్లు
క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లతో సహా కోటక్ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో బ్యాంక్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై భారం పెరుగుతోంది. ఫలితంగా కొన్ని ఆన్లైన్ సర్వీస్లపై రిస్ట్రిక్షన్లు పెట్టాలని నిర్ణయించుకున్నామని ఆర్బీఐ పేర్కొంది. ఆన్లైన్ సర్వీస్లలో అంతరాయం ఏర్పడినా కస్టమర్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
ఆర్బీఐ అనుమతితో బ్యాంక్ ఎక్స్టర్నల్ ఆడిట్ను పూర్తి చేశాక మరోసారి రివ్యూ చేపట్టనున్నారు. సమస్యలను పరిష్కరించడంపై ఫోకస్ పెట్టనున్నారు. ఆ తర్వాత బ్యాంక్పై విధించిన రిస్ట్రిక్షన్లను ఎత్తేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. కోటక్ బ్యాంక్ ఈ ఏడాది మార్చి క్వార్టర్లో రిజల్ట్స్ను ఈ నెల 27 న ప్రకటించనుంది. బ్యాంక్ షేర్లు బుధవారం ఒకటిన్నర శాతం పెరిగి రూ.1,843 దగ్గర సెటిలయ్యాయి.