
- వచ్చే నెల మూడు నుంచి విధుల్లోకి జీపీవోలు
హైదరాబాద్, వెలుగు: గ్రామ పాలనాధికారుల ఎంపికకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జీపీవో ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను, అభ్యర్థుల ర్యాంకింగ్ జాబితాను రెవెన్యూ శాఖ రిలీజ్ చేసింది. అభ్యర్థుల ఫలితాలను సీసీఎల్ఏ వెబ్ సైట్ (https://ccla.telangana.gov.in/ )లో అందుబాటులో ఉంచారు. గ్రామ పాలనాధికారుల నియామకంలో భాగంగా ఈ నెల 25న అర్హత పరీక్ష నిర్వహించారు. అయితే, జీపీవోల నియామకం కోసం పూర్వ వీఆర్వో, వీఆర్ఏలకు ఆప్షనల్ కింద అవకాశం కల్పించారు. వీరిలో 4,500 మంది దరఖాస్తు చేసుకోగా, ఇందులో 500కు పైగా మంది పరీక్ష రాయలేదు. పరీక్ష రాసినవారిలో 3,550 మంది ఎంపికయ్యారు.
సర్కారుకు థ్యాంక్స్..
జీపీవోల నియమాకంపై డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం వారు మంత్రి పొంగులేటిని కలిశారు. జూన్ 3 నుంచి జరిగే మూడో విడత సదస్సుల నాటికి జీపీవోలు విధుల్లో చేరే అవకాశం ఉందని తెలిపారు. రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
మంత్రి పొంగులేటిని కలిసిన వారిలో తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, కార్యదర్శి రమేశ్ పాక, తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంరెడ్డి, కార్యదర్శి భిక్షం, జీపీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ రావు, కార్యదర్శి లక్ష్మీ నరసింహా తదితరులు ఉన్నారు.