- నిజాంపేట, పేట్ బషీరాబాద్లోని స్థలాలను జేఎన్జే సొసైటీకి అప్పగించాలి
- హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్
ముషీరాబాద్, వెలుగు: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిజాంపేట, పేట్బషీరాబాద్లోని 70 ఎకరాలు జేఎన్జే సొసైటీకే చెందుతాయని హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ చెప్పారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యుల సమావేశం ఫౌండర్ మెంబర్ పీవీ రమణారావు అధ్యక్షతన జరిగింది. అతిథులుగా హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ అడ్వకేట్ ఎన్.రామచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థలం కోసం డబ్బులు ట్టిన జేఎన్జే సొసైటీ సభ్యులకు మాత్రమే ఈ స్థలాలు చెందుతాయని, ఇందులో మధ్యవర్తిత్వం అవసరమే లేదన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన అప్పటి మార్కెట్ ధర ప్రకారం రూ.12.33 కోట్లు చెల్లించి సొసైటీ సభ్యులు కొనుగోలు చేశారని తెలిపారు.
సుప్రీం కోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయకపోతే.. ఈ అంశంపై సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. రామచంద్రరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు అప్పగించకపోతే సొసైటీ సభ్యులకు న్యాయ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సభ్యులు రూ.2 లక్షల చొప్పున రూ.12.33 కోట్లు ప్రభుత్వానికి చెల్లించినందున 70 ఎకరాలు జర్నలిస్టులకే చెందుతాయన్నారు. పీవీ రమణారావు మాట్లాడుతూ.. స్థలాల సాధనకు న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నామని, కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామని తెలిపారు. సమావేశంలో బోడపాటి శ్రీనివాస్, షరీఫ్, అశోక్ రెడ్డి, రమేశ్ బాబు, నర్సింగ్, శ్రీనివాస్, అంజూమ్, భూషణ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం సొసైటీ సభ్యులు ఫ్లెక్సీలతో నిరసన చేపట్టారు.