రిటైర్డ్ ఆఫీసర్లకు సర్వీస్ పెంచిన ప్రభుత్వం

రిటైర్డ్ ఆఫీసర్లకు సర్వీస్ పెంచిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: వివిధ డిపార్ట్​మెంట్లలో పనిచేస్తున్న పెద్దాఫీసర్ల సర్వీసును పొడిగిస్తూ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరిలో కొంత మంది శనివారం రిటైర్ అవుతున్న వాళ్లు ఉన్నారు. పొడిగించిన సర్వీసు శనివారం పూర్తయి.. రెండోసారి చాన్స్ దక్కిన వాళ్లు మరికొందరు ఉన్నారు. కీలక శాఖలైన నీటిపారుదల, రోడ్లు భవనాల శాఖల అధికారులు ఈ లిస్టులో ఉన్నారు. సుమారు 15 మంది సర్వీసును పెంచుతూ విడుదల చేసిన జీవోలను పబ్లిక్ డొమైన్ లో కాకుండా రహస్యంగా ఉంచటం గమనార్హం.

రోడ్లు భవనాల శాఖలో ఇద్దరు

రోడ్లు భవనాల శాఖలో ఇద్దరు ఈఎన్సీల సర్వీసును మరో ఏడాదిపాటు పొడిగిస్తూ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు గణపతి రెడ్డి(నేషనల్ హైవేస్), రవీందర్ రావు (స్టేట్ హైవేస్) సర్వీసు పొడిగించారు. గణపతి రెడ్డి సర్వీసు 2016లోనే పూర్తికాగా.. అప్పటి నుంచి పెంచుతూ వస్తున్నారు. తొలుత మూడేళ్లు, తర్వాత ఏడాది, తాజాగా మరో ఏడాది పొడిగించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, ఎమ్మెల్యే క్వార్టర్స్, బంజారాహిల్స్ లో నిర్మిస్తున్న కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్, రాష్ట్రవ్యాప్తంగా 20కి పైగా కలెక్టరేట్లు, పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులు కొనసాగుతున్నందున గణపతిరెడ్డి సర్వీసును ఎక్స్​టెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక స్టేట్ రోడ్స్ ఈఎన్సీ రవీందర్ రావు సర్వీసు కూడా 2016లోనే ముగిసినా తొలుత రెండేళ్లు, ఏడాది చొప్పున మరో రెండు సార్లు, ఇప్పుడు ఇంకో ఏడాది పెంచారు.

నాగార్జునసాగర్‌ సీఈ.. యాదాద్రి ఈవో

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు సీఈ నర్సింహకు ప్రభుత్వం ఎక్స్‌టెన్షన్‌ ఇచ్చింది. ఆయన శనివారం రిటైర్డ్‌ కావాల్సి ఉండగా..  మరో ఏడాదిపాటు పొడిగింపు ఇచ్చింది. యాదాద్రి ఈవో గీత పదవీకాలాన్ని కూడా ఏడాదిపాటు పొడిగించారు. యాదాద్రి ఆలయ విస్తరణ పనులు చివరి దశలో ఉన్న కారణంగా సర్వీసును పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలో రిటైర్ కానున్న జనగామ అదనపు కలెక్టర్ ఓజే మధు పదవీకాలాన్ని మాత్రం ప్రభుత్వం పొడిగించలేదు.

ప్రమోషన్లు అందుతలేవ్

రెండు, మూడేళ్ల కిందటే రావాల్సి ఉన్న ప్రమోషన్లు కొందరు ఉన్నతాధికారుల రావట్లేదని, ప్రమోషన్లు పొందకుండానే రిటైర్ అవుతున్నారని కీలక శాఖకు చెందిన ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్​మెంట్​కు రెండు రోజుల ముందయినా ప్రమోషన్ ఇవ్వాలని ఉద్యోగులు ప్రాధేయపడుతున్న పరిస్థితి అన్ని శాఖల్లో ఉందని తెలిపారు. ఓ కీలక శాఖలో ముగ్గురు అధికారులకు ఈఎన్సీ పోస్టుకు అర్హత ఉన్నా ప్రమోషన్ ఇవ్వలేదన్నారు.

జీవోలన్నీ సీక్రెట్!

రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి కీలక జీవోలన్నీ రహస్యంగా ఉంచుతున్న ప్రభుత్వం, సర్వీసు పొడిగింపు ఉత్తర్వులు కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంచడం లేదు. రిటైర్ అయిన ఉన్నతాధికారులను కన్సల్టెంట్లుగా అదే పోస్టుల్లో ప్రభుత్వం నియమిస్తోంది. ప్రమోషన్లు రాని ఉద్యోగులు కోర్టుకు వెళ్తారన్న ఉద్దేశంతోనే జీవోలు పబ్లిక్ డొమైన్ లో ఉంచటం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.