
- కేసీఆర్ సీఎం అయ్యాక విధ్వంసం మొదలైంది: రేవంత్ రెడ్డి
- జీవో రద్దు అణు విస్ఫోటనం లాంటిది
- కేసీఆర్, ఆయన బినామీల భూముల కోసమే జీవో రద్దు
- బినామీ చట్టం కింద కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ సీఎం అయ్యాక హైదరాబాద్లో విధ్వంసం మొదలైందని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. 111 జీవో రద్దు అణు విస్ఫోటనం లాంటిదని.. హిరోషిమా, నాగసాకిలాగా హైదరాబాద్ను తయారు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘కేసీఆర్ తీసుకున్న 111 జీవో రద్దు నిర్ణయం వల్ల భవిష్యత్లో హైదరాబాద్ మొత్తం మునిగిపోయి వేల మంది మరణించే దుస్థితి వస్తుంది. 111 జీవో రద్దు వెనుక ప్రపంచంలోనే కనీవినీ ఎరుగని లక్షల కోట్ల రూపాయల భారీ కుంభకోణం ఉంది. ఆ కుంభకోణాన్ని లెక్కించేందుకు ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది” అని ఆరోపించారు.
సోమవారం గాంధీ భవన్లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, ఆయన బినామీల కోసమే 111 జీవోను రద్దు చేసి జంట నగరాలపై బాంబు వేశారని మండిపడ్డారు. ‘‘హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ రియల్ ఎస్టేట్ మాఫియాను తయారు చేసుకున్నరు. 2019 తర్వాత బీఆర్ఎస్ నేతలు భారీగా భూములు కొనుగోలు చేశారు. కేటీఆర్, కవిత, హరీశ్ రావు, దామోదర్ రావు, రంజిత్రెడ్డి వంటి బీఆర్ఎస్ నేతలు వేల ఎకరాలను పోగేసి ఫామ్హౌస్లు కట్టుకున్నారు. అక్కడ 80% భూములు కేసీఆర్ ఫ్యామి లీ, బంధువులు, బినామీల చేతుల్లోకే వెళ్లాయి” అని ఆరోపించారు. బందిపోట్లు, దావూద్నైనా క్షమించొచ్చుగానీ.. కేసీఆర్, కేటీఆర్ను క్షమించరాదన్నారు. ‘‘కేసీఆర్, కేటీఆర్, సోమేశ్ కుమార్, అర్వింద్ కుమార్ దుష్ట చతుష్టయమే 111 జీవో రద్దుకు కారణం. వాళ్లను అమరవీరుల స్తూపానికి కట్టేసి కొట్టినా తప్పులేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిన్న విషయం కాదిది
జీవో రద్దు అనేది జంట నగరాలకు మంచి నీటి సరఫరాకు సంబంధించిన చిన్న సమస్యగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ విమర్శించారు. ఇది చిన్న విషయం కాదన్నారు. ‘‘రూపాయి ఖర్చు లేకుండా పైప్లైన్లు వేశామన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఆ పైప్ కంపెనీల నుంచి కమీషన్ల కోసమే కొత్త నాటకానికి తెరలేపిండు” అని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్కు కృష్ణా, గోదావరి జలాలు వచ్చాయని అన్నారు. ఇప్పుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్సాగర్ విధ్వంసం కోసమే 111 జీవోను రద్దు చేశారని మండిపడ్డారు. ‘‘1908 సెప్టెంబర్ 27, 28 తేదీల్లో భారీ వర్షం కురిసి మూసీ, ఈసీ నదులు వరదలతో ఉప్పొంగాయి. పురానాపూల్ బ్రిడ్జి మీది నుంచి భారీ వరద ప్రవహించింది. అప్పటి లెక్కల ప్రకారమే సుమారు 50 వేల మంది చనిపోయారు. పరిస్థితిని పరిశీలించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య పలు సూచనలు చేశారు. అందులో భాగంగానే మూసీ, దాని ఉపనది అయిన ఈసీపై రిజర్వాయర్లను కట్టాలని చెప్పారు. ఆ సూచనల మేరకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను నిర్మించారు. ఆ ప్రాజెక్టులు తాగునీటి కోసం కట్టినవి కాదు. వరదల నివారణకు కట్టించారు. ఆ ప్రాజెక్టుల వల్ల వరదలు తగ్గడంతో పాటు తాగునీటిని సరఫరా చేసేవారు. గ్రావిటీ ద్వారానే సిటీకి నీటిని అందించవచ్చు. అట్లాంటి ప్రాధాన్యం ఉన్న జంట జలాశయాలను కాపాడేందుకు, అవి కలుషితం కాకుండా ఉంచేందుకు 1996 మార్చి 8న ఆనాటి ప్రభుత్వం 111 జీవోను తీసుకొచ్చింది. చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో పరిశ్రమలు, భారీ హోటళ్లు, కమర్షియల్, రెసిడెన్షియల్ కాంప్లెక్సులు కట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 84 ఊర్లను బయో కన్జర్వేషన్ జోన్ కింద పెట్టారు. కానీ, సీఎం కేసీఆర్ ఒకే ఒక్క సంతకంతో ఆ ప్రాంతాన్ని, జంట జలాశయాల మనుగడను ప్రశ్నార్థకం చేసేశారు’’ అని రేవంత్ అన్నారు.
రూ.600 కోట్ల స్థలాన్ని 40 కోట్లకే కట్టబెట్టారు
‘ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్’ పేరిట కోకాపేటలోని రూ. 600 కోట్ల భూమిని బీఆర్ఎస్ పార్టీకి రూ.40 కోట్లకే కట్టబెట్టారని రేవంత్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఆఫీసుల కోసం జిల్లాల్లో వందల ఎకరాల భూమిని ఆ పార్టీ ఇప్పటికే తీసుకుందన్నారు. ‘‘టీఆర్ఎస్ పార్టీకి గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో బంజారాహిల్స్లో ఎకరం భూమిని కేటాయించారు. పార్టీ హైదరాబాద్ శాఖ కోసం మరో ఎకరం భూమిని అధికారంలోకి వచ్చాక తీసుకున్నారు. అన్ని జిల్లాల్లోనూ పార్టీ ఆఫీసులకు జాగాలు తీసుకున్నారు. కానీ, 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్కు సొంతంగా పార్టీ ఆఫీసు లేదు. గాంధీభవన్ అనేది ఒక ట్రస్ట్ ఆఫీసు. దానికి నెలనెలా కిరాయి కడ్తున్నాం. గాంధీభవన్ పక్కన హౌసింగ్ బోర్డు 5,100 చదరపుటడుగుల స్థలాన్ని కేటాయించింది. అప్పటి రేటు ప్రకారం డబ్బులు కూడా కట్టాం. కానీ, ఆ స్థలం తమది అంటూ భీంరావు వాడకు చెందిన క్షత్రియ సంఘాలు కోర్టుకు వెళ్లాయి. ప్రభుత్వం సరిగ్గా వాదించకపోవడంతో వారికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. భీంరావు వాడలోని భూమిని పేదలకు పంచితే మాకేం అభ్యంతరం లేదు. కానీ, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ హౌసింగ్బోర్డు సుప్రీంకోర్టుకు వెళ్తే.. కాంగ్రెస్కు పార్టీ ఆఫీసు అవసరమే లేదని 2016లో కేసీఆర్ సర్కార్ కేసును వాపస్ తీసుకుంది” అని అన్నారు. భూమి కోసం తాము కట్టిన డబ్బులూ ఇప్పటికీ ప్రభుత్వం వద్దనే ఉన్నాయని తెలిపారు. కాగా, తెలంగాణపై ప్రియాంకా గాంధీ ఫోకస్ పెట్టారని, వచ్చే ఎన్నికల్లోపు రాష్ట్రంలో ఆమె 20కిపైగా సభలను నిర్వహిస్తారని మీడియాతో చిట్చాట్లో రేవంత్ రెడ్డి చెప్పారు.
చెరువులన్నీ గాయబ్
హైదరాబాద్ అంటేనే లేక్ సిటీ అని, కానీ, ఇప్పుడు ఆ చెరువులన్నీ మాయం అయ్యాయని రేవంత్ అన్నారు. 111 జీవో పరిధిలోని ప్రాంతాన్ని రక్షించేందుకు సోమేశ్ కుమార్ నేతృత్వంలో వేసిన కమిటీనే.. ఆ జీవోను రద్దు చేయాలంటూ నివేదిక ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ తరఫున నిజనిర్ధారణ కమిటీని వేస్తామని చెప్పారు. 111 జీవో పరిధిలోని గ్రామాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటామని, పర్యావరణ వేత్తలతో చర్చించి నివేదికను రూపొంది స్తామని తెలిపారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక జరిగిన భూ లావాదేవీలను బహిరంగ పరచాలన్నారు. కేసీఆర్పై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బినామీ చట్టం ప్రకారం.. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై విచారణకు ఆదేశించాల న్నారు. ఫిర్యాదు చేసేందుకు తాను ఎక్కడికైనా రావడానికి సిద్ధమన్నారు.