మోడీ కాళేశ్వరంపై ఎందుకు మాట్లాడలే.. బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్టే : రేవంత్

మోడీ కాళేశ్వరంపై ఎందుకు మాట్లాడలే.. బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్టే : రేవంత్

సీఎం కేసీఆర్ లక్షకోట్లు దోచుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్లే కేసీఆర్, కేటీఆర్ పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ విజయభేరిలో మాట్లాడారు రేవంత్.  హైదరాబాద్ లో ఇన్నర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ, అంతర్జాతీయ ఎయిర్ పోర్టు తెచ్చిందే కాంగ్రెస్సేనని చెప్పారు.  రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్స్ అని అన్నారు. రైతులకు  కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. దొరల తెలంగాణ కావాలా? ప్రజల తెలంగాణ కావాలా? తేల్చుకోవాలన్నారు.   కాంగ్రెస్ గెలిస్తేనే  పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు.  బీఆర్ఎస్ దోపిడి చేయలేని రంగమే లేదన్నారు. 

 నవంబర్ 7న ఎల్బీస్టేడియంలో జరిగిన సభలో ప్రధాని మోడీ కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.   మోడీ మేడిగడ్డకు ఎందుకు పోలేదన్నారు. మోడీ లిక్కర్ స్కాం గురించి మాట్లాడుతాడు కానీ...కాళేశ్వరంగురించి మాట్లాడలేదన్నారు. బీజేపీకి ఓటేస్తే.. బీఆర్ఎస్ కు ఓటేసినట్టేనని విమర్శించారు. 

 టికెట్ రాని నేతలెవరు బాధపడొద్దని...ప్రభుత్వం రాగానే సముచిత న్యాయం చేస్తామని చెప్పారు.  జోగురామన్న ఆదిలాబాద్ ను దోచుకున్నారని ఆరోపించారు. దోచుకొమ్మని పిల్ల రాక్షసులను ప్రజల మీదకు వదిలిండని విమర్శించారు.  24 గంటల కరెంట్ ఇచ్చినట్లు నిరూపిస్తే నామినేషన్ వెయ్యబోనన్నారు.  ప్రభుత్వం ఉచిత కరెంట్ పేరుతో వేల కోట్లు దోచుకుందన్నారు.  డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి జోగురామన్న,కాంగ్రెస్ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నుంచి పాయల శంకర్  పోటీచేస్తున్నారు.