కేటీఆర్, కవిత ప్రశ్నలకు రేవంత్ కౌంటర్

కేటీఆర్, కవిత ప్రశ్నలకు రేవంత్ కౌంటర్

రాహుల్  పర్యటనపై  టీఆర్ఎస్ నేతల  ట్వీట్లకు  కౌంటరిచ్చారు  పీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి. రాహుల్ ని  ప్రశ్నించే  ముందు  తను అడిగే  ప్రశ్నలకు  సమాధానం చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి.  మోడీ రైతు  వ్యతిరేక  చట్టాలు తెచ్చినప్పుడు  మీరెక్కడున్నారని  ప్రశ్నించారు. మీ తండ్రి మోడీ  ముందు మోకరిల్లి.. ఇకపై  తెలంగాణ నుంచి  బాయిల్డ్ రైస్  ఇవ్వమని లేఖ ఇచ్చి.. రైతులకు  ఉరితాళ్లు  బిగించినప్పుడు  మీరెక్కడున్నారని  ఎమ్మెల్సీ కవితపై  మండిపడ్డారు రేవేంత్ రెడ్డి. వరివేస్తే  ఉరి అని  మీ తండ్రి  ప్రవచనాలు చెప్పి.. ఫాం హౌస్ లో  150 ఎకరాల్లో వరి  వేసినప్పడు ఎక్కడున్నారని  కవితపై విమర్శలు గుప్పించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో  మిర్చీ రైతులు  పిట్టల్లా రాలిపోతుంటే  ఒక్క టీఆర్ఎస్ నేత పరామర్శించలేదన్నారు.

రైతులకు  లక్ష రూపాయల  రుణ మాఫీ  చేస్తానని  కేసీఆర్ మోసం  చేశారన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రైతులకు  అవసరమైన  26 లక్షల టన్నుల  ఎరువు ఫ్రీగా ఇస్తానని చెప్పి ఐదేళ్లవుతున్నా..  అరక్వింటా  ఎరువులు కూడా  ఇవ్వలేదన్నారు. అకాల  వర్షాలతో కల్లాల్లో ధాన్యపురాశులు  తడిచి  రైతులు విలపిస్తున్నారని..  వారి కష్టాన్ని  పట్టించుకోలేదన్నారు. ధాన్యం  కొనుగోళ్ల  విషయంలో  బీజేపీతో కలిసి  డ్రామాలాడారన్నారు.  కనీస మద్దతు ధర కన్నా తక్కువగా 14 వందల  రూపాయలకే రైతులు ధాన్యం  అమ్ముకుంటున్నారన్నారు  రేవంత్ రెడ్డి.

అంతకు ముందు  రాహుల్ గాంధీ రాష్ట్రపర్యటనపై కవిత, కేటీఆర్ వరుస ట్వీట్లు చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణలో ఎందుకు పర్యటిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎన్నిసార్లు ప్రస్తావించిందని కవిత నిలదీశారు. ఉభయసభల్లో టీఆర్ఎస్ పోరాడుతుంటే..కాంగ్రెస్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. వరికొనుగోళ్ల విషయంలో దేశ వ్యాప్తంగా ఒకే విధానాన్ని పాటించాలని టీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే.. కాంగ్రెస్ ఎక్కడ కూర్చుందని అడిగారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా.. పెండింగ్ బకాలు, నిధుల గురించి కేంద్రాన్ని టీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే.. కాంగ్రెస్ ఏం చేస్తుందని ట్వీట్ చేశారు. ప్రభుత్వ పథకాలు రాష్ట్రముఖచిత్రాన్ని ఎలా మార్చాయో మీ నాయకులను అడిగి తెలుసుకోండంటూ రాహుల్ కి సూచించారు. కేసీఆర్ పథకాలను స్ఫూర్తిగా తీసుకొని 11 రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో అర్థం చేసుకోవడానికి తెలంగాణ స్వాగతం పలుకుతుందన్నారు కవిత. ఇక రాహుల్ గాంధీ స్టడీ టూర్ కి స్వాగతం అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఉత్తమ రైతు, స్నేహపూర్వక పద్ధతులను తెలుసుకొని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించారు.