డీకే శివకుమార్ తో రేవంత్​ భేటీ!

డీకే శివకుమార్ తో రేవంత్​ భేటీ!

హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి శుక్రవారం బెంగళూరు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరికల నేపథ్యంలో ఆయన ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో భేటీ కోసమే అక్కడికి వెళ్లినట్టు తెలిసింది. రెండు రోజుల కింద వైఎస్ షర్మిల ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్​ గాంధీతో భేటీ అయి తన పార్టీ వైఎస్​ఆర్టీపీ విలీనంపై చర్చించారు. దాదాపు అన్నీ ఓకే అయినా.. ఆమె పోటీ చేసే స్థానంపైనే కొంచెం సందిగ్ధం ఏర్పడింది. 

షర్మిల పాలేరు టికెట్​కోసం పట్టుబడుతున్నారు. మరోవైపు ఏపీకి సేవలందించాలన్న అంశాన్ని ఆమె తోసిపుచ్చుతున్నారు. కాంగ్రెస్​లో చేరిక, పార్టీ విలీనంపై గతంలో పలు సార్లు డీకే శివకుమార్​తోనూ ఆమె భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయంలో డీకే జోక్యం కోసం రేవంత్​ బెంగళూరుకు వెళ్లినట్టు చెప్తున్నారు. కాంగ్రెస్​లో షర్మిల పార్టీ విలీనం విధివిధానాలపై చర్చించినట్టు తెలిసింది. 

అంతేగాకుండా.. తుమ్మల నాగేశ్వర్​రావు చేరికపైనా ఆయనతోపాటు సునీల్ కనుగోలుతోనూ సమావేశమైనట్టు తెలుస్తున్నది. ఇటీవలి సర్వేల్లో పాలేరు నియోజకవర్గం పరిస్థితి ఏంటన్నది తెలుసుకున్నట్టు సమాచారం. పాలేరు టికెట్​కు ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెడీగా ఉన్నారు. ఆయనకు తోడు తుమ్మల, షర్మిల కూడా అడుగుతున్న నేపథ్యంలో ఎవరికిస్తే బాగుంటుందన్న చర్చ జరిగినట్టు తెలిసింది.