నాకు, సంజయ్​కు నోటీసులిచ్చిన్రు ..   కేటీఆర్​కు ఎందుకియ్యలె?

నాకు, సంజయ్​కు నోటీసులిచ్చిన్రు ..   కేటీఆర్​కు ఎందుకియ్యలె?
  • మంత్రి వ్యాఖ్యల గురించి  సిట్​కు​ చెప్పిన: రేవంత్

హైదరాబాద్‌‌, వెలుగు: టీఎస్ ​పీఎస్సీ పేపర్​ లీక్​ వ్యవహారంలో తనకు, బండి సంజయ్​కు నోటీసులిచ్చిన సిట్​.. దానిపై మాట్లాడిన  కేటీఆర్​కు ఎందుకు నోటీసులు ఇయ్యలేదని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. తమను భయపెట్టేందుకే సర్కారు సిట్​ ద్వారా నోటీసులిచ్చిందని ఆరోపించారు. కేటీఆర్​ చేసిన వ్యాఖ్యలను సిట్​ అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, ఆయన్ను విచారిస్తే అసలు నేరస్తులెవరో బయటికొస్తారని చెప్పానన్నారు.  పేపర్​ లీక్​పై చేసిన ఆరోపణలకు ఆధారాలను ఇవ్వాలంటూ నోటీసులు అందడంతో..  గురువారం హైదరాబాద్​ హిమాయత్​నగర్​లోని సిట్​ ఆఫీసులో రేవంత్​ విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

సిట్​ దర్యాప్తు పూర్తికాకముందే నేరం ఎలా జరిగిందో కేటీఆర్​ ప్రజలకు బహిర్గతం చేశారని.. ఇంత చేసినా కేటీఆర్​ వ్యాఖ్యలు తమ దృష్టికి రాలేదని సిట్​ అధికారులు అనడంలో అంతర్యం ఏంటని రేవంత్​ ప్రశ్నించారు. కేటీఆర్​పై ఫిర్యాదును తీసుకోబోమని, కేవలం సమాచారమే తీసుకుంటామని సిట్​ అధికారులు తనతో చెప్పారన్నారు.  కేటీఆర్​తో పాటు టీఎస్ పీఎస్సీ చైర్మన్​ జనార్దన్​ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ లను విచారించాలని కోరానని పేర్కొన్నారు.   వంద మందికి పైగా అభ్యర్థులకు 100 మార్కులు వచ్చాయని తాము చెప్తే.. వాళ్లను విచారించాల్సిందిపోయి రివర్స్​లో తమకు నోటీసులిచ్చి సర్కారు భయపెట్టే ప్రయత్నం  చేస్తున్నదని మండిపడ్డారు. అయినా సరే రాజ్యాంగాన్ని గౌరవిస్తూ తమ వద్ద ఉన్న సమాచారం సిట్​ అధికారి ఏఆర్​ శ్రీనివాస్​కు అందజేశామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లు, అర్హత సాధించిన వారు.. ఉద్యోగాలు పొందినోళ్ల వివరాలను వెబ్​సైట్​లో పెట్టాల్సిందిగా అధికారులను కోరానన్నారు.   

ఇయ్యాల, రేపు ఓయూ, కేయూల్లో నిరసన తెలుపుతం

టీఎస్ ​పీఎస్సీ పేపర్​ లీక్​ వ్యవహారంలో పూర్తి బాధ్యత మంత్రి కేటీఆర్​దే అని రేవంత్​ రెడ్డి అన్నారు. నేరాన్ని ఇద్దరికే పరిమితం చేసి.. పెద్ద తలకాయల్ని కేటీఆర్​ కాపాడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్​ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేశారు. రాజకీయ పునరావాసానికి టీఎస్​ పీఎస్సీ కేంద్రంగా మారిందని మండిపడ్డారు. లీక్‌‌ వ్యవహారంలో నిందితుడు రాజశేఖర్​ రెడ్డి, కేటీఆర్​ పీఏ తిరుపతికి కీలక భాగస్వామ్యం ఉందన్నారు. పేపర్లు లీక్​ కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కేవలం బీఆర్​ఎస్​ పార్టీ విస్తరణపైనే దృష్టి పెట్టిందని ఫైర్​ అయ్యారు. నిరుద్యోగులకు  టీఎస్ ​పీఎస్సీ పై విశ్వాసం కల్పించడంతో రాష్ట్ర సర్కారు ఫెయిల్​ అయిందన్నారు. హిందువులకు గుడి, ముస్లింలకు మసీదు, సిక్కులకు గురుద్వారా ఎలాగో.. నిరుద్యోగులకు టీఎస్​పీఎస్సీ అలాంటిదేనన్నారు.  విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఎన్ని కేసులనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.  

శుక్ర, శనివారాల్లో ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన దీక్ష ఉంటుందని, శనివారం సాయంత్రం కాకతీయ యూనివర్సిటీలోనూ నిరసన కార్యక్రమాలు ఉంటాయని రేవంత్​ వెల్లడించారు. 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగుల భవిష్యత్​ను ఆంధ్రా వాళ్లే నిర్ణయిస్తున్నారని రేవంత్​ కామెంట్​ చేశారు. ఇంత పెద్ద టీఎస్ పీఎస్సీ వ్యవస్థలో అసిస్టెంట్​ సెక్షన్​ ఆఫీసర్​ హోదాకు సరిపోయే తెలంగాణ బిడ్డ ఒక్కరూ లేరా అని కేసీఆర్​ను ప్రశ్నించారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్​ కుమార్​ ఏపీలోని రాజమండ్రికి చెందిన వ్యక్తి అన్నారు. పేపర్​ లీక్​పై విచారణ చేసేందుకూ తెలంగాణకు చెందిన అధికారిని నియమించలేదని రేవంత్​ విమర్శించారు. నిజాయతీ కలిగిన అధికారులు ఎంతో మంది ఉన్నా విజయవాడకు చెందిన ఏఆర్​ శ్రీనివాస్​కు విచారణ బాధ్యతలు అప్పగించారన్నారు.  

సిట్​ఆఫీసు ముందు ఉద్రిక్తత

సిట్​ ఆఫీసుకు వెళ్తున్న రేవంత్​ రెడ్డి కాన్వాయ్​ను పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. బంజారాహిల్స్​ తాజ్​కృష్ణ వద్ద రేవంత్​ వాహనం మినహా మిగతా వాహనాలు వెళ్లకుండా పోలీసులు ఆపేశారు. వాటిని అనుమతించాల్సిందేనని రేవంత్​ వారించడంతో పంపించారు. తర్వాత లిబర్టీ చౌరస్తా వద్దకు చేరుకోగానే రేవంత్​ వాహనం తప్ప వేరే వాహనాలు వెళ్లేందుకు వీల్లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో పోలీసులతో రేవంత్​ వాగ్వాదానికి దిగారు. వాహనాలను అనుమతించకపోవడంతో ఆయన కారు దిగి పార్టీ శ్రేణులతో కలిసి నడుచుకుంటూ సిట్​ ఆఫీసుకు వెళ్లారు. సిట్​ ఆఫీసు వద్ద కూడా కాంగ్రెస్​ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులు, పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. సిట్​ ఆఫీసు ముందు కాంగ్రెస్​క్యాడర్​ నిరసనకు దిగింది. కేటీఆర్​ను బర్తరఫ్​ చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఎన్​ఎస్​యూఐ స్టేట్​ ప్రెసిడెంట్​ బల్మూరి వెంకట్​ సహా కాంగ్రెస్​ శ్రేణులను పోలీసులు అరెస్ట్​ చేసి స్టేషన్లకు తరలించారు. కాగా, కాంగ్రెస్​ శ్రేణులు నిరసనలకు పిలుపునివ్వడంతో ఉదయం నుంచే కాంగ్రెస్​ ముఖ్య నేతలను పోలీసులు హౌస్​ అరెస్ట్​ చేశారు. మల్లు రవి, అద్దంకి దయాకర్​, షబ్బీర్​ అలీ, అంజన్​కుమార్​ యాదవ్​, సునీతా రావు తదితర సీనియర్​ నేతలను పోలీసులు ఇళ్లలోనే నిర్బంధించారు.