
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ సరూర్ నగర్ లో నిర్వహించిన కాంగ్రెస్ బూత్ లెవెల్ కార్యకర్తల శిక్షణా శిబిరంలో ఆయన మాట్లా డారు. తెలంగాణలో సీడబ్ల్యూసీ సమావేశా లు జరగడం ఈ గడ్డకు దక్కిన గౌరవమని చెప్పారు. దీంతో పీసీసీ అధ్యక్షుడిగా తన జన్మ ధన్యం అయిందన్నారు. కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలంటే క్షేత్ర స్థాయిలో పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ నియామకం జరగాలన్నారు. ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించేది బూత్ లెవెల్ ఏజెంటేనని, కాంగ్రెస్ జెండాను మోసే నిఖార్సైన కార్యకర్తలను బూత్ లెవెల్ ఏజెంట్లుగా నియమించుకుందామన్నారు.
90 లక్షల ఓట్లు తెచ్చుకుంటే రాష్ట్రంలో 90 సీట్లు గెలుస్తామన్నారు రేవంత్. వంద రోజులు కాంగ్రెస్ పార్టీ కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేటాయించాలని కోరారు. అయ్యప్ప, శివ మాలధారణలా కాంగ్రెస్ దీక్ష తీసుకుని, సోనియమ్మ మాల వేసుకుని కష్టపడాలని సూచించారు. కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని, రజాకర్లు కూడా ఇంత దోపిడీ, విధ్వంసానికి పాల్పడలేదని చెప్పారు. వక్ఫ్ భూమిలో నాంపల్లి విజయ నగర్ కాలనీలో ఎంఐఎంకు అనుమతి ఇచ్చారని, మరి తుక్కుగూడలో కాంగ్రెస్ సభకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. దేవుడి భూమి అనే సాకుతో అనుమతి నిరాకరించినా ఆ దేవుడే దారి చూపారన్నారు. ధర్మమే కాంగ్రెస్ ను గెలిపిస్తుంది... వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే నని స్పష్టం చేశారు.