
బీఆర్ఎస్ నేతలు కుట్రలతో గెలవాలని చూస్తున్నారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గువ్వల బాలరాజుపై దాడి విషయంలో తమపై కేటీఆర్ ఆరోపణలు తగవన్నారు. గువ్వల బాలరాజే అడ్డువచ్చిన వారిపై దాడి చేశారని ఆరోపించారు. ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అని.. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఇలాంటి డ్రామాలు కామన్ అని అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి వెనుక కుట్ర లేదని పోలీసులే తేల్చారన్నారు. ఈ దాడిలో నిందితుడు రాజును ఇంత వరకు మీడియా ముందు ఎందుకు ప్రవేశ పెట్టలేదు.. రిమాండ్ రిపోర్టు ఎందుకు బయటపెట్టలేదన్నారు. కేటీఆర్, హరీశ్ రావు సానుభూతి కోసం నాటకాలు ఆడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ డ్రామాలను ప్రజలునమ్మొద్దని..కాంగ్రెస్ పై జరుగుతున్న కుట్రను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు రేవంత్.
కొత్తప్రభాకర్ దాడి కుట్రపై విచారణ జరగాలన్నారు రేవంత్. కొత్త ప్రభాకర్ రెడ్డి దాడిలో నిందితుడు రాజుకు హరీశ్ ఫోన్ సంభాషణపై విచారణ జరగాలన్నారు. మరో 15 రోజుల్లో 3 కుట్రలు జరుగుతాయని కేటీఆర్ చెప్పారని.. ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు రేవంత్. కర్ణాటక నుంచి కిరాయి మనుషులను తెచ్చిందే బీఆర్ఎస్ నేతలన్నారు. కర్ణాటకలో హామీలు అమలు కావడం లేదని తప్పడు ప్రచారం చేయించారన్నారు. మేడిగడ్డ కుంగిపోతే కాంగ్రెస్ కుట్ర అని అన్నారు .. ఫాక్స్ కాన్ పై కూడా కేటీఆర్ తప్పుడు ప్రచారం చేశారన్నారు. రిటైర్డ్ అధికారులపై ఫిర్యాదు చేస్తే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు.
కాంగ్రెస్ పై బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, జేడీఎస్ కలిసి కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీతో జేడీఎస్ పొత్తు ఖరారయ్యిందని.. కుమార స్వామితో ప్రెస్ మీట్ పెట్టించిందే కేసీఆర్ అని అన్నారు. దండుపాళ్యం ముఠా..కాళకేయ ముఠా తెలంగాణను పట్టిపీడిస్తుందన్నారు. ఫోన్లు హ్యాకింగ్ జరుగుతున్నా ఈసీ ఎందుకు పట్టించుకోవట్లేదన్నారు. సైబర్ క్రైంలో గజరావు భూపాల్ తమ ఫోన్లు హ్యాకింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు.
మాదిగలను మోదీ మరోసారి మోసం చేశారని రేవంత్ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతిస్తుందన్నారు. ఈ శీతాకాలం సమావేశాల్లో ఎస్సీవర్గీకరణపై బిల్లు పెట్టే దమ్ము మోదీకి ఉందా? అని ప్రశ్నించారు రేవంత్. రెచ్చగొట్టే ప్రసంగాలపై ఈసీ చర్యలేవన్నారు. కేసీఆర్,కేటీఆర్,హరీశ్ రావులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ వస్తే ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యబోమని.. మరోసారి కేసీఆర్ కు సవాల్ విసిరారు రేవంత్.