- ఆయన రావణాసురుడిలాంటోడే
- పది హామీలను పది తలలుగా పెట్టి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తం
- దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజున
- అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు
- యంత్రాంగం బీఆర్ఎస్ కార్యక్రమాల్లో మునిగిపోయిందని విమర్శ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది దశాబ్ది ఉత్సవాలు కాదని.. దశాబ్ది దగా అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఇచ్చిన ముఖ్యమైన పది హామీలను అమలు చేయలేదన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, పోడు పట్టాలు, రైతు రుణమాఫీ, మైనారిటీలు, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. వాటిని ప్రజలకు వివరించేందుకు ‘దశాబ్ది దగా’ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఉత్సవాల ముగింపు రోజైన ఈ నెల22న అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు చేపడతామన్నారు. కేసీఆర్.. రావణాసురుడిలాంటోడేనని, పది హామీల వైఫల్యాలను పది తలలుగా కేసీఆర్ దిష్టి బొమ్మకు తగిలించి.. ఊరేగింపుగా తీసుకెళ్లి.. ఆర్డీవోలు, తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పిస్తామన్నారు. శనివారం గాంధీ భవన్లో పార్టీ పొలిటికల్అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించారు. ఆ మీటింగ్అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు.
పీఏసీ సమావేశంలో మూడు అంశాలపై చర్చ
పీఏసీ సమావేశంలో మూడు అంశాలపై చర్చించామని రేవంత్ చెప్పారు. రాజకీయ కార్యకలాపాలు పీఏసీ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. పీఏసీ కన్వీనర్గా షబ్బీర్ అలీని నియమించామని చెప్పారు. పది రోజుల్లో పార్టీ మండల కమిటీలను నియమిస్తామన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రభుత్వ యంత్రాంగాన్ని కేసీఆర్తన పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. డెత్సర్టిఫికెట్తీసుకుందామన్నా ఆఫీసర్లు అందుబాటులో ఉండడం లేదని, బీఆర్ఎస్ సేవలో మునిగి తేలుతున్నారని ఫైర్అయ్యారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే, నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, బలరాం నాయక్, అంజన్కుమార్ యాదవ్, రేణుకా చౌదరి, సంపత్ కుమార్, చిన్నారెడ్డి పాల్గొన్నారు.
కవులు, కళాకారులను అవమానిస్తరా!
బి.నర్సింగరావు సామాజిక స్పృహ ఉన్న డైరెక్టర్అని, ప్రజా సమస్యలను వివరిస్తూ మా భూమి అనే సినిమా తీశారని రేవంత్ గుర్తుచేశారు. అలాంటి వ్యక్తికి ప్రభుత్వ పెద్దలు అపాయింట్మెంట్ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ కవులు, కళాకారులను అవమానించే హక్కు కేటీఆర్కు లేదన్నారు. కేటీఆర్ తన వ్యవహార శైలి మార్చుకొని నర్సింగరావును కలవాలని సూచించారు.
అమరుల ఆత్మలు ఘోషిస్తున్నయ్
కేసీఆర్ చేసిన మోసాలకు అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని రేవంత్ మండిపడ్డారు. వారి త్యాగాలను గుర్తించడం లేదన్నారు. వారి కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి, డబుల్బెడ్రూం ఇండ్లు ఇస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్కు ఉద్యమకారులన్నా, అమరవీరులన్నా అసూయ అని వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఉద్యమకారులను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ను కొనసాగిస్తామని చెప్పలేకనే...
కేసీఆర్నే సీఎంగా కొనసాగిస్తామని చెప్పలేకనే.. ఆయన పథకాలను కొనసాగిస్తామని బండి సంజయ్ చెప్పారని రేవంత్ ఎద్దేవా చేశారు. మోదీ పాలన ఉండాలంటూ కేసీఆర్ అభినందిస్తే.. కేసీఆర్ అద్భుత పాలన చేస్తున్నారంటూ సంజయ్ అంటున్నారని విమర్శించారు. రెండో రాజధాని ప్రతిపాదనపై చర్చకు వస్తే.. పార్టీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరికలపై అధిష్టానంతో చర్చించి ప్రకటన చేస్తామన్నారు.
పలువురు కాంగ్రెస్ నేతలకు కీలక బాధ్యతలు
పలువురు నేతలకు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ను సేవా దళ్, ఐఎన్టీయూసీ ఇన్చార్జిగా రేవంత్ నియమించారు. గీతా రెడ్డికి మహిళా కాంగ్రెస్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. పీసీసీ వైస్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డిని యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, పీసీసీ ఎన్నారై కో ఆర్డినేటర్ మద్దుల గాల్రెడ్డిని ఎన్నారై ప్రోగ్రామ్స్ అండ్ ఇండియన్ ఓవర్సీస్ కార్యక్రమాలకు ఇన్చార్జ్గా నియమిస్తూ శనివారం ఆదేశాలిచ్చారు.