తండాల అభివృద్ధికి రూ.100 కోట్లిస్తాం : రేవంత్​ రెడ్డి

తండాల అభివృద్ధికి రూ.100 కోట్లిస్తాం : రేవంత్​ రెడ్డి
  •     రాజిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి
  •     నర్సాపూర్​ విజయభేరి సభలో రేవంత్​ రెడ్డి

నర్సాపూర్​, శివ్వంపేట, వెలుగు : నర్సాపూర్ లంబాడి సోదరుల అడ్డా..  గిరిజనుల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు.. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలోని లంబాడి తండాల సమగ్ర అభివృద్ధికి రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయిస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్​ రేవంత్​ రెడ్డి ప్రకటించారు. సోమవారం నర్సాపూర్​లో జరిగిన విజయభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగులు, విద్యార్థులకు మేలు కలిగేలా నర్సాపూర్ నియోజకవర్గాన్ని సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్ లో కలిపే అంశాన్ని కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

కాళేశ్వరం కాల్వలకు, రీజినల్​ రింగ్​ రోడ్డుకు భూములిచ్చే రైతులకు మెరుగైన పరిహారం అందేలా చూస్తామన్నారు. బీఆర్ఎస్​ అభ్యర్థి సునీతా రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించి కాంగ్రెస్​అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.  ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. నర్సాపూర్​లో గెలిచి రేవంత్​ రెడ్డికి గిఫ్ట్​ ఇస్తామన్నారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలో పోడు భూములు, కాళేశ్వరం, ట్రిపుల్​ఆర్ నిర్వాసితులకు న్యాయం, నర్సాపూర్​ ఆర్టీసీ బస్​ డిపో విస్తరణ, పీజీ కాలేజీకి బిల్డింగ్ మంజూరు, గవర్నమెంట్​ హాస్పిటల్ వంద పడకల స్థాయికి విస్తరణ, మినీ స్టేడియం, ఇంటిగ్రేటెడ్​మార్కెట్​ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

సభ సక్సెస్​తో కాంగ్రెస్‌ లో జోష్​   

కాంగ్రెస్​విజయభేరి బహిరంగ సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సభ సక్సెస్​ కావడం  కాంగ్రెస్​ శ్రేణుల్లో జోష్​ నింపింది. రేవంత్​ రెడ్డి స్పీచ్​సభకు వచ్చిన వారిలో ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా వివిధ మండలాలకు చెందిన బీఆర్​ఎస్​ నాయకులు రేవంత్​ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. కార్యక్రమంలో ఆంజనేయులు గౌడ్​, రవీందర్​రెడ్డి, సుధీర్​రెడ్డి, కరుణాకర్​రెడ్డి, సుహాసినిరెడ్డి, సుజాత, శేషసాయిరెడ్డి, శ్రీనివాస్ గుప్తా, మల్లేశం, నరేందర్​ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఖాలేక్​ పాల్గొన్నారు.