ఖాట్మాండు: నేపాల్లో మళ్లీ జెన్ జీల ఆందోళనలు షురూ అయ్యాయి. బుధవారం బారా జిల్లాలోని సిమ్రా ప్రాంతంలో జెన్జీ యువకులు ఒకవైపు.. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ కార్యకర్తలు మరోవైపు పోటాపోటీ ర్యాలీలు నిర్వహించారు. ఈ రెండు వర్గాల మధ్య తోపులాట జరగడంతో గొడవలు మొదలయ్యాయి. గురువారం దేశవ్యాప్తంగా పలుచోట్ల అల్లర్లు జరిగాయి. ఎయిర్పోర్టు సమీపంలోనూ ఘర్షణలు జరగడంతో అధికారులు కర్ఫ్యూ విధించారు.
దేశవ్యాప్తంగా సమావేశాలపై నిషేధం ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని, ఎవరూ తీవ్రంగా గాయపడలేదని నేపాల్ పోలీసులు తెలిపారు. తాత్కాలిక ప్రధాని సుశీలా కార్కి శాంతిని కోరుతూ ప్రకటన జారీ చేశారు. రెచ్చగొట్టే రాజకీయాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
