రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

భూత్పూర్​, వెలుగు: బైక్ అదుపు తప్పడంతో డివైడర్​ను ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. మహబూబ్​నగర్​జిల్లా భూత్పూర్​మండల కేంద్రానికి చెందిన బజారు ఆనంద్(24), ఇతడి అక్క నాగమణి(25), మేనత్త లక్ష్మమ్మ (60) బైక్​పై మంగళవారం ఉదయం మహబూబ్​నగర్​ వెళ్లారు. పనులు ముగించుకొని మధ్యాహ్నం ఇంటికి బయల్దేరారు. భూత్పూర్​కు చేరుకోగానే క్రాసింగ్​వద్ద బైక్​ను కంట్రోల్ చేయలేక వేగంగా వచ్చి డివైడర్​ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో అక్కాతమ్ముడితో పాటు మేనత్త చనిపోయారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు భూత్పూర్​సీఐ రజితారెడ్డి, ఎస్ఐ భాస్కర్​రెడ్డి తెలిపారు. 

డిచ్​పల్లి వద్ద...

డిచ్​పల్లి : నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి మండలంలోని సుద్దపల్లి వద్ద ఎన్​హెచ్​ 44 పై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న రెండు బైక్​లను కంటైనర్​ ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..మోపాల్​ మండలం కులాస్​పూర్​కు చెందిన పోగుల శ్యామ్, ఇతడి భార్య నవ్య, కొడుకు రుషి, కూతురు సమన్వి సుద్దపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి గ్రామానికి బైక్​పై వస్తుండగా హైవే పై ఓవర్​స్పీడ్​తో వస్తున్న కంటైనర్ ​వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దవాఖానకు తరలిస్తుండగా నవ్య, సమన్వి(8) చనిపోయారు. యాక్సిడెంట్​ చేసి ముందుకు వెళ్లిన కంటైనర్​ మరో బైక్​ని ఢీకొట్టడంతో బైక్​పై ఉన్న జిల్లా కేంద్రంలోని గూపన్​పల్లి కి చెందిన కుర్మా సాయిలు(55) చనిపోయాడు. కంటైనర్​ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.