రోహిత్‌తో రచ్చ.. లక్ష్మణ్‌తో వార్: అజిత్ అగార్కర్‌పై బీసీసీఐ వేటు!

రోహిత్‌తో రచ్చ.. లక్ష్మణ్‌తో వార్: అజిత్ అగార్కర్‌పై బీసీసీఐ వేటు!

Ajit Agarkar Exit: 2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత క్రికెట్‌లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను బాధ్యతల నుంచి తప్పించేందుకు బీసీసీఐ (BCCI) సిద్ధమైంది. మూడేళ్లలో నాలుగు ఐసీసీ ఫైనల్స్ చేరి, మూడు ట్రోఫీలు అందించిన ఘనమైన రికార్డు అగార్కర్ ప్యానెల్‌కు ఉన్నప్పటికీ, బోర్డులోని పెద్దలతో తీవ్ర విభేదాలు రావడంతోనే అతడిపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. 

రోహిత్ తొలగింపుకు ప్లాన్.. అగార్కర్‌కు రివర్స్ షాక్:

ఇంగ్లాండ్ తో సిరీస్ ముగిసిన వెంటనే రోహిత్ శర్మను వన్డేల నుంచి తప్పించాలని అజిత్ అగార్కర్ చూశాడు. 2027 వరల్డ్ కప్ లక్ష్యంగా యశస్వి జైస్వాల్‌ను వన్డేల్లో ఓపెనర్‌గా సిద్ధం చేయాలని, అందుకే రోహిత్‌కు రెస్ట్ ఇవ్వాలని భావించాడు.

* ప్రజ్ఞాన్ ఓజాతో కబురు: రోహిత్ శర్మకు అత్యంత ఆప్తుడైన సౌత్ జోన్ సెలెక్టర్ ప్రజ్ఞాన్ ఓజాతో ఈ విషయాన్ని రోహిత్‌కు చెప్పించారు.

* పెద్దలకు కంప్లైంట్: 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని పట్టుదలతో ఉన్న రోహిత్ శర్మ, బీసీసీఐలోని ఒక పవర్‌ఫుల్ అడ్మినిస్ట్రేటర్‌ను కలిసి సెలెక్టర్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

* అగార్కర్‌కు చెప్పకుండానే ప్రకటన: అగార్కర్‌కు కనీసం సమాచారం ఇవ్వకుండానే బీసీసీఐ.. రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలను ఖండిస్తూ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ఇది తనను తీవ్రంగా అవమానించడమేనని అజిత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. 

వీవీఎస్ లక్ష్మణ్‌తో అగార్కర్ డైరెక్ట్ వార్: 

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో అజి అగార్కర్‌కు కూడా పొసగడం లేదని వార్తలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి.

* ఆసియా గేమ్స్ వివాదం: ఆసియా గేమ్స్‌కు మెయిన్ టీమ్‌ను పంపాలా వద్దా అనే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. లక్ష్మణ్ అత్యుత్తమ జట్టును పంపాలని కోరగా, ఆసియా గేమ్స్‌కు ద్వితీయ శ్రేణి జట్టు సరిపోతుందని అగార్కర్ పేర్కొన్నాడు. 

* ఇండియా ఏ షెడ్యూలింగ్ పై రచ్చ: శ్రీనగర్‌లో జరిగే ఇరానీ కప్, పుదుచ్చేరిలో జరిగే ఇండియా-ఎ మ్యాచ్‌ల తేదీలు ఒకేసారి రావడంపై వీవీఎస్ లక్ష్మణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఆటగాళ్ల గాయాల జాబితా మీడియాకు లీక్ కావడం కూడా ఇద్దరి మధ్య గొడవ మరింత పెరిగేలా చేసింది. 

రివ్యూ మీటింగ్‌కు డుమ్మా.. కథ ముగిసింది: 

* ఇంగ్లాండ్ పర్యటన డిజాస్టర్ కావడంపై చర్చించేందుకు ముంబైలో జరిగిన అత్యంత కీలకమైన బీసీసీఐ రివ్యూ మీటింగ్‌కు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ హాజరుకాకపోవడం తీవ్ర వివాదానికి దారి తీసింది. దీంతో బోర్డు పెద్దలు అగార్కర్‌ను తప్పించి, కొత్త చీఫ్ సెలెక్టర్‌ను నియమించాలని ఫిక్స్ అయ్యారు. దిగ్గజ ప్లేయర్ల రిటైర్మెంట్ లేదా కొనసాగింపు బీసీసీఐ బోర్డు చేతుల్లోనే ఉంటుందని, సెలెక్టర్లకు ఆ అధికారం లేదనే విషయాన్ని ఈ ఘటన మరోసారి నిరూపించింది.