- భద్రతా సిబ్బందిపై గావస్కర్ ఆగ్రహం
పుణె: మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియం భద్రతా సిబ్బంది సరైన రక్షణ కల్పించలేకపోతున్నారని మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండో టెస్ట్ మూడో రోజు ఓ అభిమాని సెక్యూరిటి సిబ్బందిని దాటుకుని వచ్చి రోహిత్ పాదాలను తాకేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ముంబైకర్ అదుపు తప్పి కిందపడిపోయాడు. దీనిపై కామెంట్రీ బాక్స్లో ఉన్న సన్నీ స్పందించాడు. అభిమానులు చూపే అత్యుత్సాహ చర్యల వల్ల ఆటగాళ్లకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని గట్టిగా ప్రశ్నించాడు. ‘కేవలం భద్రతా సిబ్బంది బాధ్యతారాహిత్యం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మైదానంలో దూసుకొస్తున్న అభిమానులను అడ్డుకోవడం లేదు. ఫ్రీగా వచ్చిందని మ్యాచ్ను చూస్తున్నారు. అభిమానులు ఎటువైపు నుంచి వస్తున్నారో కూడా తెలుసుకోలేకపోతున్నారు. తీరా ఆటగాళ్ల దగ్గరికి వచ్చాకా హడావుడి చేస్తున్నారు. ముందే పసిగట్టి అడ్డుకుంటే ఈ సమస్యలు ఉత్పన్నం కావు కదా? ’ అని గావస్కర్ అన్నాడు.