అంతా కల్తీ.. హైదర్​గూడలోని రెస్టారెంట్​లో కుళ్లిన చికెన్, గుడ్లు

అంతా కల్తీ..  హైదర్​గూడలోని రెస్టారెంట్​లో కుళ్లిన చికెన్, గుడ్లు
  •     ఉప్పల్​లో కెమికల్స్ తో  ఐస్​క్రీమ్​తయారీ
  •     సిటీలో హడలెత్తిస్తున్న కల్తీ ఫుడ్​ ఐటమ్స్
  •     అధికారుల తనిఖీల్లో ఒక్కొక్కటిగా వెలుగులోకి..  
  •     భయాందోళనకు గురవుతున్న ప్రజలు

హైదరాబాద్‌‌‌‌/గండిపేట/ఉప్పల్‌‌‌‌, వెలుగు: గ్రేటర్ ​సిటీలో కల్తీ ఫుడ్​ విక్రయం పెరిగిపోతోంది. అక్రమార్జనకు అలవాటుపడిన చాలా మంది హోటల్స్, షాపుల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రతి పదార్థాన్ని కల్తీ చేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఐస్​క్రీమ్, చికెన్, మటన్, బిర్యానీ, గుడ్లు ఇలా ఏది కొందామన్నా ఒకటికి నాలుగుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. సిటీలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. జీహెచ్‌‌‌‌ఎంసీ, డ్రగ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. శుక్రవారం వేర్వేరు చోట్ల అధికారులు నిర్వహించిన సోదాల్లో కుళ్లిన తందూరీ చికెన్‌‌‌‌, కెమికల్స్​ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌, డేంజరస్ యాంటీ బయోటిక్స్‌‌‌‌ మెడిసిన్​పట్టుబడ్డాయి.

కుళ్లిన ఫుడ్​ ఐటీమ్స్.. రూ.50వేలు ఫైన్

బేగంబజార్‌‌‌‌‌‌‌‌లో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్, అత్తాపూర్‌‌‌‌‌‌‌‌లో డూప్లికేట్ రెడ్‌‌‌‌లేబుల్‌‌‌‌ టీ పొడి తయారీ ఘటనలు మరువక ముందే శుక్రవారం సిటీలో మరో రెండు వెలుగు చూశాయి. రాజేంద్రనగర్‌‌‌‌ పరిధి హైదర్‌‌‌‌‌‌‌‌గూడలోని ఎస్‌‌‌‌వీఎం గ్రాండ్‌‌‌‌ వెంగమాంబ రెస్టారెంట్‌‌‌‌లో కుళ్లిన తందూరీ చికెన్, కోడిగుడ్ల స్టోర్​చేసి ఉండడం కలకలం రేపింది. రెండు, మూడు రోజుల కింద వండిన తందూరీ చికెన్‌‌‌‌ను హోటల్ యాజమాన్యం ఫ్రిడ్జ్‌‌‌‌లో స్టోర్​చేస్తున్నారు. వాటినే వేడి చేసి హోటల్‌‌‌‌కి వచ్చే కస్టమర్లకు ఫ్రెష్‌‌‌‌గా వడ్డిస్తున్నారు. గుర్తించిన పలువురు కస్టమర్లు జీహెచ్‌‌‌‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయగా, రాజేంద్రనగర్‌‌‌‌ సర్కిల్‌‌‌‌ ఉపకమిషనర్‌‌‌‌ రవికుమార్‌‌‌‌ ఆధ్వర్యంలో శుక్రవారం రెస్టారెంట్​లో సోదాలు నిర్వహించారు. కుళ్లిపోయిన చికెన్‌‌‌‌, కోడిగుడ్లను ఫ్రిడ్జ్​లో స్టోర్‌‌‌‌ చేసినట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని హోటల్​యాజమానులకు రూ.50 వేలు ఫైన్​విధించారు.

గోనా క్రీమ్స్​ పేరుతో డేంజరస్​ కెమికల్స్‌‌‌‌

గోన శ్రీనివాసరావు అనే వ్యాపారి ఉప్పల్​లో గోనా క్రీమ్స్ పేరుతో ఐస్ క్రీమ్ యూనిట్‌‌‌‌ నిర్వహిస్తున్నాడు. ఇందులో చిన్నారులు ఎంతో ఇష్టపడే బెర్రీస్‌‌‌‌, చాకోస్ సహా ఇతర ఫ్లేవర్లతో ఐస్‌‌‌‌ క్రీమ్స్‌‌‌‌ తయారు చేస్తున్నాడు. అయితే వాటిలో నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్, ఎక్స్ పైర్​అయిన రసాయనాలను మిక్స్‌‌‌‌ చేస్తున్నాడు. అపరిశుభ్ర వాతావరణంలో స్టోర్​చేస్తున్నాడు. వివిధ రకాల పేర్లతో బ్రాండెడ్​స్టిక్కర్లు అంటించి, సిటీ శివారు ప్రాంతాల్లోని చిన్నచిన్న బేకరీలు, ఐస్‌‌‌‌క్రీమ్ పార్లర్లకు ‌‌‌‌కు సప్లయ్​చేస్తున్నాడు. ఏడాదిగా ఈ దందా నడిపిస్తున్నాడు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌‌‌‌ఓటీ పోలీసులు శుక్రవారం ఐస్​క్రీమ్​యూనిట్​లో సోదాలు జరిపారు. యజమాని గోన శ్రీనివాసరావును అరెస్ట్ చేసి, కల్తీ ఐస్‌‌‌‌క్రీమ్​బాక్సులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వాటిని టెస్టుల కోసం ల్యాబ్‌‌‌‌కు పంపించారు.

ఉత్తరాఖండ్‌‌‌‌ నుంచి సిటీకి..

గత మంగళవారం సిటీ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ పోలీసులతో కలిసి డ్రగ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ ఆఫీసర్లు మలక్‌‌‌‌పేట పరిధిలోని మూసారాంబాగ్‌‌‌‌లో సోదాలు నిర్వహించారు. డ్రగ్‌‌‌‌ డీలర్లు అరవపల్లి సత్యనారాయణ, వంగరి నవీన్‌‌‌‌ వద్ద నకిలీ ఎమ్‌‌‌‌పీఓడీ–200 యాంటీ బయోటిక్స్ ట్యాబ్లెట్లు గుర్తించారు. రూ.7.34లక్షలు విలువ చేసే 27,200 ట్యాబ్లెట్లను సీజ్ చేశారు. వారితోపాటు మీర్‌‌‌‌‌‌‌‌పేటకు చెందిన డ్రగ్​డీలర్‌‌‌‌‌‌‌‌ గండ్ల రాములును అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ముగ్గురికి ఉత్తరాఖండ్‌‌‌‌ కొధ్వార్‌‌‌‌‌‌‌‌ నుంచి నకిలీ డ్రగ్స్​సప్లయ్ అవుతున్నట్లు గుర్తించారు. టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ టీమ్స్‌‌‌‌తో ఉత్తరాఖండ్‌‌‌‌లో  ‘ఆపరేషన్ జాయ్’ పేరుతో సోదాలు చేశారు. అక్కడి నెక్టార్ హెర్బ్స్ కంపెనీపై దాడులు నిర్వహించి, రూ.44.33లక్షలు విలువ చేసే 38,350 యాంటీ బయోటిక్‌‌‌‌ ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ నిర్వాహకుడు విషత్​కుమార్‌‌‌‌‌‌‌‌తో పాటు యూపీకి చెందిన సచిన్‌‌‌‌కుమార్‌‌‌‌ను అరెస్ట్ చేశారు.