
షార్జా: ఐపీఎల్ 14 ప్లే ఆఫ్స్లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. లీగ్ స్టేజ్లో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) జట్లు ఎలిమినేటర్ పోరుకు రెడీ అయ్యాయి. సోమవారం జరిగే ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫయర్–2కు అర్హత సాధించడమే కాకుండా ఫైనల్ బెర్త్కు మరింత దగ్గరవుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నాకౌట్ అవుతుంది. ఈ నేపథ్యంలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. రెండు టీమ్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నప్పటికీ ఆర్సీబీ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. ఈ సీజన్ తర్వాత బెంగళూరు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న విరాట్కు ఈ పోరు చాలా ప్రతిష్టాత్మకం కానుంది. ఆర్సీబీకి టైటిల్ అందిచాలన్న కల నెరవేరాలంటే ఈ ఎలిమినేటర్ టెస్టును విరాట్ పాస్ అవ్వాల్సిందే. పడిక్కల్, మ్యాక్స్వెల్, భరత్ మరోసారి కీలకం కానున్నారు. బౌలింగ్లో ఆర్సీబీకి పెద్దగా సమస్యల్లేవు. ఇక, లీగ్ ఫస్ట్ ఫేజ్లో తడబడిన నైట్రైడర్స్ యూఏఈ లెగ్లో అదరగొడుతుంది. వెంకటేశ్ అయ్యర్ రాకతో బ్యాటింగ్ లైనప్ బలంగా తయారైంది. ఆండ్రీ రసెల్ అందుబాటులోకి వస్తే మిడిలార్డర్ బలం రెట్టింపు అవుతుంది. స్పిన్నర్లు నరైన్, చక్రవర్తి కీలకం కానున్నారు. ఇక, గత మ్యాచ్లో ఆర్సీబీని 92కే ఆలౌట్ చేసిన నైట్రైడర్స్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగడం ఖాయం. దీంతో ముందడుగు వేసేదెవరనేది ఆసక్తి రేపుతోంది.