IPL 2025 Final: ఫైనల్లో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ బ్యాటర్లు.. పంజాబ్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్

IPL 2025 Final: ఫైనల్లో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ బ్యాటర్లు.. పంజాబ్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్

అహ్మదాబాద్‌ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ చేసింది. మంగళవారం (జూన్ 3) నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో ప్రతి ఒక్కరూ కూడా సమిష్టిగా ఆడి జట్టు భారీ స్కోర్ చేయడంలో సహకరించారు. 43 పరుగులు చేసిన కోహ్లీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో కైల్ జెమీసన్, అర్షదీప్ తలో మూడు వికెట్లు పడగొట్టాడు. ఓమార్జాయి, చాహల్, విజయ్ కుమార్ వైశుక్ తలో వికెట్ తీసుకున్నారు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు తొలి ఓవర్ నుంచే ఇన్నింగ్స్ ను దూకుడుగా ఆరంభించింది. అర్షదీప్ వేసిన తొలి ఓవర్ లో 13 పరుగులు రాబట్టింది. అయితే రెండో ఓవర్లోనే ఆర్సీబీకి షాక్ తగిలింది. జెమీసన్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి సాల్ట్ (16)  ఔటయ్యాడు. ఈ దశలో మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ పవర్ ప్లే లో జాగ్రత్తగా ఆడుతూ 55 పరుగులు రాబట్టారు. పవరే ప్లే తర్వాత భారీ షాట్ కు ప్రయత్నించి మయాంక్ (24) చాహల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. 

పటిదార్, కోహ్లీ స్వల్ప భాగస్వామ్యాన్ని నిర్మించి జట్టు స్కోర్ ను కాస్త ముందుకు తీసుకెళ్లారు. పటిదార్ (26) ఉన్నంత సేపు వేగంగా ఆడి  ఔటైనా కోహ్లీ, లివింగ్ స్టోన్ మరో స్వల్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు పటిష్ట స్థితికి చేర్చే ప్రయత్నం చేశారు. అయితే 43 పరుగులు చేసి కోహ్లీ ఔట్ కావడంతో మ్యాచ్ పై పంజాబ్ పట్టు బిగించినట్టు కనిపించింది. ఈ దశలో జితేష్ మెరుపులు మెరిపించాడు. కేవలం 10 బంతుల్లోనే 24 పరుగులు చేసి దూకుడు చూపించాడు. చివర్లో కీలక దశలో వికెట్లు చేజార్చుకున్నప్పటికీ పంజాబ్ ముందు 191 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. చివరి ఓవర్లో అర్షదీప్ మూడు వికెట్లు తీసి బెంగళూరు స్కోర్ 200 పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు.