
- బెంగళూరు బన్గయా బాద్షా
- ఐపీఎల్ కొత్త చాంపియన్ ఆర్సీబీ
- ఫైనల్లో 6 రన్స్ తేడాతో అద్భుత విజయం
- రాణించిన కోహ్లీ, క్రునాల్, భువనేశ్వర్
- పంజాబ్ కింగ్స్కు తప్పని నిరాశ
ఒక జట్టు కల నిజమైంది. ఓ యోధుడి అలుపెరగని కృషికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. కోట్లాది మంది అభిమానుల బెంగ తీరింది. వాళ్లు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఆ ఒక్క క్షణం రానే వచ్చింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. ఆ టీమ్ సూపర్ స్టార్, క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ కల నెరవేరింది. దేశం తరఫున వన్డే, టీ20 వరల్డ్ కప్స్, చాంపియన్స్ ట్రోఫీలు నెగ్గిన కోహ్లీ తన కెరీర్లో లోటుగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీ ఎట్టకేలకు ముద్దాడాడు..!
ఎంత మంచి జట్టుతో ఆడినా.. ఎంతమంది మేటి ఆటగాళ్లు బరిలో నిలిచినా.. అందని కలల కప్పు18వ ప్రయత్నంలో ఆర్సీబీ ఒడిలోకి వచ్చేసింది..! గతంలో మూడుసార్లు తుది మెట్టుపై బోల్తా కొట్టిన ఆర్సీబీ ఈసారి ఎలాంటి తప్పిదానికి తావివ్వలేదు.. బ్యాటింగ్ కింగ్ కోహ్లీ ముందుండి నడిపించగా.. బౌలర్లూ సత్తా చాటడంతో తమలాగే తొలి ట్రోఫీ కోసం తపిస్తున్న పంజాబ్ కింగ్స్కు గుండె కోతను మిగిలిస్తూ ఆర్సీబీ ఐపీఎల్ నయా చాంపియన్గా నిలిచింది. గత 17 ఏండ్లలో ఒక్క కప్పు నెగ్గకపో యినా.. ఐదేసి ట్రోఫీలు సాధించిన ముంబై, చెన్నై జట్లను మించి తమను పిచ్చిగా ఆరాధిస్తున్న లాయల్ ఫ్యాన్స్కు ఆర్సీబీ ట్రోఫీతో రాయల్ సెల్యూట్ చేసింది. కోహ్లీ లక్కీ నంబర్, జెర్సీ నంబర్ అయిన 18వ సీజన్లో ఆ జట్టు టైటిల్ అందుకోవడం మరింత స్పెషల్.
పాపం పంజాబ్ కింగ్స్. ఆ జట్టుకు మళ్లీ నిరాశే. 11 ఏండ్ల తర్వాత రెండోసారి ఫైనల్ చేరిన ఆ జట్టు గమ్యాన్ని ముద్దాడలేకపోయింది. ఆ జట్టుకు ఓటములు కొత్తేం కాదు. కానీ, ఈసారి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని కింగ్స్ గతానికి భిన్నమైన ఆట చూపెట్టింది. మేటి జట్లను మట్టికరిపిస్తూ లీగ్ టాపర్గా నిలిచి ఫైనల్కు వచ్చింది. గతేడాది కోల్కతాకు టైటిల్ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడుతూ జట్టును టైటిల్ ముంగిట నిలిపాడు. కానీ, ఆఖరి అడ్డంకిని దాటకపోవడంతో పంజాబ్ ఐపీఎల్ ట్రోఫీ నిరీక్షణకు ఇంకా తెరపడలేదు.
అహ్మదాబాద్: ఐపీఎల్లో కొత్త పొద్దు పొడిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మెగా లీగ్లో కొత్త చాంపియన్గా అవతరించింది. మంగళవారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన18వ సీజన్ మెగా ఫైనల్లో ఆర్సీబీ 6 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించి టైటిల్ ఖాతాలో వేసుకుంది. హోరాహోరీ పోరులో తొలుత ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 190/9 స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (35 బాల్స్లో 3 ఫోర్లతో 43) టాప్ స్కోరర్గా నిలిచాడు. రజత్ పటీదార్ (16 బాల్స్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 26), లియామ్ లివింగ్స్టోన్ (15 బాల్స్లో 2 సిక్సర్లతో 25), జితేష్ శర్మ (10 బాల్స్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24) వేగంగా ఆడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ (3/40), కైల్ జెమీసన్ (3/48) చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్లో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 184/7 స్కోరు చేసి ఓడింది. శశాంక్ సింగ్ (30 బాల్స్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 61 నాటౌట్) ఒంటరి పోరాటం వృథా అయింది. ఆర్సీబీ బౌలర్లలో క్రునాల్ (2/17), భువనేశ్వర్ కుమార్ (2/38) చెరో రెండు వికెట్లతో రాణించారు. క్రునాల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
కోహ్లీ ముందుండి..
.ఫ్లాట్ పిచ్పై టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ మంచి స్కోరు చేసింది. సూపర్ ఫామ్లో ఉన్న ఫిల్ సాల్ట్ (16) ఆరంభంలోనే ఔటవగా.. 15 ఓవర్లు క్రీజులో నిలిచిన విరాట్ కోహ్లీ వేగంగా ఆడలేకపోయినా కీలక భాగస్వామ్యాలతో ఆకట్టుకున్నాడు. పేసర్ అర్ష్దీప్ సింగ్ వైడ్తో బౌలింగ్ ఆరంభించగా.. మూడో బాల్కు సిక్స్ కొట్టిన సాల్ట్.. ఐదో బాల్ను ఫోర్గా మలిచాడు. జెమీసన్ బౌలింగ్లోనూ ఫోర్తో జోరు మీద కనిపించిన అతను మరో భారీ షాట్కు ట్రై చేసి శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇవ్వడంతో రెండో ఓవర్లోనే పంజాబ్ బ్రేక్ సాధించింది. వన్డౌన్లో వచ్చిన మయాంక్ అగర్వాల్ (18 బాల్స్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో24).. మూడో ఓవర్లో స్ట్రెయిట్ సిక్స్తో అలరించగా.. మరో ఎండ్లో విరాట్ కోహ్లీ నింపాదిగా బ్యాటింగ్ చేశాడు. తను స్ట్రయిక్ రొటేట్ చేయగా... జెమీసన్, వైశాక్ బౌలింగ్లో రెండు ఫోర్లు కొట్టిన మయాంక్ పవర్ ప్లేను 55/1తో ముగించాడు. కానీ, ఫీల్డింగ్ మారిన వెంటనే ఆర్సీబీకి మరో షాక్ తగిలింది. ఏడో ఓవర్లో బౌలింగ్కు వచ్చిన స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తన రెండో బాల్కే వికెట్ తీశాడు.
తను లెగ్ స్టంప్పై వేసిన ఎక్స్ట్రా బౌన్స్ బాల్కు మయాంక్ స్వీప్ షాట్ ఆడగా అది ఎడ్జ్ తీసుకొని అర్ష్దీప్ చేతుల్లో పడింది. దాంతో ఆర్సీబీ 56/2తో నిలవగా.. కోహ్లీకి తోడైన కెప్టెన్ రజత్ పటీదార్ ఉన్నంతసేపు దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. వైశాక్ బౌలింగ్లో ఫోర్, చహల్ ఓవర్లో సిక్స్తో ఎటాక్ చేశాడు. అజ్మతుల్లా బౌలింగ్లో కోహ్లీ తన రెండో ఫోర్ కొట్టగా.. సగం ఓవర్లకు ఆర్సీబీ 87/2 స్కోరుతో నిలిచింది. జెమీసన్ బౌలింగ్లో మిడాఫ్ మీదుగా భారీ సిక్స్ కొట్టిన రజత్.. అదే ఓవర్లో పదునైన యార్కర్కు వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక్కడి నుంచి పంజాబ్ బౌలర్లు డాట్ బాల్స్తో ఒత్తిడి పెంచారు. కోహ్లీతో పాటు కొత్తగా క్రీజులోకి వచ్చిన లివింగ్స్టోన్ క్రీజులో ఇబ్బంది పడటంతో ఓదశలో వరుసగా 15 బాల్స్లో ఒక్క బౌండ్రీ కూడా రాలేదు. కానీ, టైమౌట్ తర్వాత ఆర్సీబీ గేరు మార్చే ప్రయత్నం చేసింది. చహల్ వేసిన 14వ ఓవర్లో లివింగ్స్టోన్ క్రీజు ముందుకొచ్చి సిక్స్ కొట్టగా.. కోహ్లీ ఫోర్తో టచ్లోకి వచ్చినట్టు కనిపించాడు. కానీ, తర్వాతి ఓవర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ ఫిఫ్త్ స్టంప్పై వేసిన స్లో బాల్ను పుల్ చేయబోయిన కోహ్లీ అతనికే క్యాచ్ ఇవ్వడంతో స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. 15 ఓవర్లకు 132/4తో నిలిచిన ఆర్సీబీ 180 చేస్తే గొప్పే అనిపించింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన జితేష్ శర్మ మరోసారి తన పవర్ హిట్టింగ్తో ఆకట్టుకున్నాడు. అర్ష్దీప్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో ఆర్సీబీ ఫ్యాన్స్లో మళ్లీ జోష్ నింపాడు. ఆపై, జెమీసన్ బౌలింగ్లో జితేష్ రెండు సిక్సర్లు కొట్టగా.. ఓ సిక్స్ బాదిన లివింగ్స్టోన్ ఎల్బీ అయ్యాడు. ఆ ఓవర్లో మొత్తంగా 23 రన్స్ వచ్చాయి. వైశాక్ వేసిన తర్వాతి ఓవర్ తొలి బాల్కే హిట్టర్ రొమారియో షెఫర్డ్ (17) ఇచ్చిన క్యాచ్ను ప్రవీణ్ దూబే డ్రాప్ చేశాడు. నాలుగో బాల్కు జితేష్ను బౌల్డ్ చేసిన వైశాక్ ఓవర్లో ఐదు రన్స్ మాత్రమే ఇచ్చి ఆర్సీబీ జోరుకు బ్రేక్ వేశాడు. 19వ ఓవర్లో ఒమర్జామ్ వరుసగా నాలుగు సింగిల్స్ ఇచ్చినా చివరి రెండు బాల్స్కు షెఫర్డ్ 4, 6 కొట్టడంతో బెంగళూరు 200 స్కోరు చేసేలా కనిపించింది. కానీ, లాస్ట్ ఓవర్లో అర్ష్దీప్ సింగ్.. షెఫర్డ్, క్రునాల్ (4), భువనేశ్వర్ (1) వికెట్లు తీసి మూడు రన్స్ మాత్రమే ఇవ్వడంతో ఆర్సీబీ 190తో సరిపెట్టింది.
క్రునాల్, భువనేశ్వర్ దెబ్బ
ఛేజింగ్ను పంజాబ్ మెరుగ్గానే ఆరంభించినా మధ్యలో ఆర్సీబీ స్పిన్నర్ క్రునాల్, పేసర్ భువనేశ్వర్ కుమార్ కొట్టిన దెబ్బతో ఓటమి తప్పించుకోలేకపోయింది. తొలి ఓవర్లోనే ఫోర్, సిక్స్తో ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (24), ప్రభ్సిమ్రన్ సింగ్ (26) జోరు చూపెట్టారు. అదే సమయంలో ఆర్సీబీ బౌలర్లు సైతం రన్స్ కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హేజిల్వుడ్ వేసిన మూడో ఓవర్లో ప్రభ్ చేతుల్లోకి కొట్టిన క్యాచ్ను బౌండ్రీలైన్ వద్ద రొమారియో షెఫర్డ్ డ్రాప్ చేశాడు. అప్పటికి 9 రన్స్ వద్ద ఉన్న ప్రభ్ దీన్ని సద్వినియోగం చేసుకొని క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. హేజిల్వుడ్ తర్వాతి ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ఆర్య.. లాస్ట్ బాల్కు సిక్స్కు ట్రై చేశాడు. కానీ, బౌండ్రీ లైన్ వద్ద సాల్ట్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో తొలి వికెట్కు 43 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. వన్డౌన్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ (39).. పుల్ షాట్తో సిక్స్ కొట్టగా పవర్ ప్లేను పంజాబ్ 52/1తో ముగించింది. కానీ, ఏడో ఓవర్లో బౌలింగ్కు వచ్చిన స్పిన్నర్ క్రునాల్ మూడే రన్స్ ఇచ్చాడు. మరో స్పిన్నర్ సుయాశ్కు ఇంగ్లిస్, ప్రభ్ చెరో సిక్స్తో వెల్కం చెప్పారు.
కానీ, తొమ్మిదో ఓవర్లో ప్రభ్సిమ్రన్ను క్రునాల్ ఔట్ చేయగా.. సూపర్ ఫామ్లో ఉన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (1) షెఫర్డ్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇవ్వడంతో పంజాబ్ 81/3తో డీలా పడ్డది. షెఫర్డ్ బౌలింగ్లోనే సిక్స్తో దూకుడు చూపెట్టిన ఇంగ్లిష్ను 13వ ఓవర్లో క్రునాల్ పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ వైపు మొగ్గింది. పంజాబ్ 98/4తో కష్టాల్లో పడ్డ దశలో నెహాల్ వధేర (15), శశాంక్ సింగ్ ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. హేజిల్వుడ్ వేసిన 16వ ఓవర్లో శశాంక్ రెండు సిక్సర్లు కొట్టి పంజాబ్ శిబిరంలో మళ్లీ ఆశలు రేపాడు. కానీ, భువనేశ్వర్ ఆ టీమ్కు డబుల్ షాకిచ్చాడు. మూడు బాల్స్ తేడాలో వాధెరతో పాటు డేంజర్ మ్యాన్ స్టోయినిస్ (6)ను ఔట్ చేయడంతో పంజాబ్ ఫ్యాన్స్ అంతా డీలా పడ్డారు. చివరి మూడు ఓవర్లలో ఆ టీమ్కు 47 రన్స్ అవసరం అవగా.. శశాంక్ క్రీజులో ఉండటంతో పూర్తిగా ఆశలు కోల్పోలేదు. 18వ ఓవర్లో ఒమర్జాయ్ (1)ను ఔట్ చేసిన యశ్ ఐదు రన్సే ఇవ్వగా.. భువనేశ్వర్ వేసిన 19వ ఓవర్లో శశాంక్ 6, 4 సహా 13 రన్స్ రాబట్టాడు. చివరి ఓవర్లో 29 రన్స్ అవసరం అవగా.. శశాంక్ చివరి నాలుగు బాల్స్కు 6, 4,6,6 కొట్టినా ఫలితం లేకపోయింది.
స్కోర్బోర్డ్
బెంగళూరు: సాల్ట్ (సి) అయ్యర్ (బి) జెమీసన్ 16, కోహ్లీ (సి అండ్ బి) ఒమర్జాయ్ 43, మయాంక్ (సి) అర్ష్దీప్ (బి) చహల్ 24, రజత్ (ఎల్బీ) జెమీసన్ 26, లివింగ్స్టోన్ (ఎల్బీ) జెమీసన్ 25, జితేష్ (బి) వైశాక్ 24, షెపర్డ్ (ఎల్బీ) అర్ష్దీప్ 17, క్రునాల్ (సి) అయ్యర్ (బి) అర్ష్దీప్ 4, భువనేశ్వర్ (సి) ఆర్య (బి) అర్ష్దీప్ 1, యశ్ (నాటౌట్) 1, ఎక్స్ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 190/9; వికెట్ల పతనం: 1-–18, 2–-56, 3-–96, 4-–131, 5–-167, 6-–171, 7-–188, 8-–189, 9–-190; బౌలింగ్: అర్ష్దీప్ 4–0–40–3, జెమీసన్ 4–0–48–3 , ఒమర్జాయ్ 4–0–35–1, వైశాక్ 4–0–30–1, చహల్ 4–0–37–1.
పంజాబ్: ప్రియాన్ష్ (సి) సాల్ట్ (బి) హేజిల్వుడ్ 24, ప్రభ్సిమ్రన్ (సి) భువనేశ్వర్ (బి) క్రునాల్ 26 , ఇంగ్లిస్ (సి) లివింగ్స్టోన్ (బి) క్రునాల్ 39, శ్రేయస్ (సి) జితేష్ (బి) షెపర్డ్ 1, వధేరా (సి) క్రునాల్ (బి) భువనేశ్వర్ 15 , శశాంక్ సింగ్ (నాటౌట్) 61, స్టోయినిస్ (సి) యశ్ దయాళ్ (బి) భువనేశ్వర్ 6, ఒమర్జాయ్ (సి) సబ్/ భండాగె (బి) యశ్ 1, జెమీసన్( నాటౌట్) 0; ఎక్స్ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో184/7; వికెట్ల పతనం: 1–-43, 2-–72, 3–-79, 4–-98, 5-–136, 6-–142, 7-–145; బౌలింగ్: భువనేశ్వర్ 4–0–38–2, యశ్ దయాళ్ 3–0–18–1, హేజిల్వుడ్ 4–0–54–1, క్రునాల్ 4–0–17–2, సుయాష్ 2–0–19–0, రొమారియో 3–0–30–1 .