
కాజీపేట, వెలుగు: శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొడుకు, బీఆర్ఎస్ నాయకుడు సిరికొండ ప్రశాంత్ పై కాజీపేట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభకు జనం లక్షలాదిగా తరలిరావడంతో ఉప్పల్ రైల్వే స్టేషన్ దగ్గర రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
భూపాలపల్లి నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఉప్పల్ మీదుగా సభకు వెళ్లడంతో రైల్వే గేట్ దగ్గర జన సందోహంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. జనాన్ని తరలించిన బీఆర్ఎస్ నాయకుడు సిరికొండ ప్రశాంత్ ఆధ్వర్యంలో రైల్వే గేట్ మూసివేసి ఆందోళన చేపట్టారు. ఆర్పీఎఫ్ పోలీసులు ఆందోళనకారులను పక్కకు తప్పించి రైళ్లను పంపించారు. ఆందోళన చేసినందుకు గాను సిరికొండ ప్రశాంత్ తో సహా 14 మంది బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు కాపీలను నిందితులకు ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ చటర్జీ అందజేశారు.