మిర్యాలగూడ, వెలుగు: విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ఉన్నత చదువులకు అండగా నిలుస్తానని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా సోమవారం క్యాంప్ ఆఫీస్లో నియోజకవర్గంలో టెన్త్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 66 మంది విద్యార్థులను సన్మానించి, ప్రశంసాపత్రాలు, రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని రిటైర్డ్ కలెక్టర్, టీటీడీ జేఈవో ఆదావత్ శరత్ నాయక్ తో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ప్రోత్సాహకాలతో విద్యార్థులకు చదువు విలువ తెలుస్తుందన్నారు. విద్య ద్వారానే ఏదైనా సాధిస్తామనే భరోసా కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. అనంతరం మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. డీఎస్పీ రాజశేఖర్ రాజు, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాస్ నేత, మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధా బాలు, నూకల వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు.
