రూ. 45 లక్షలు విలువ చేసే డ్రగ్స్ ను పట్టుకున్నం : సీపీ సుధీర్ బాబు

రూ. 45 లక్షలు విలువ చేసే డ్రగ్స్ ను పట్టుకున్నం : సీపీ సుధీర్ బాబు

అంతరాష్ట్ర డ్రగ్ ఫెడ్లింగ్ రాకెట్ ను చేధించామన్నారు రాచకొండ సీపీ సుధీర్ బాబు. ఎల్బీనగర్ ఎస్ఒటి, జవహర్ నగర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారని చెప్పారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారిపై ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసామన్నారు. నిందితుల నుండి రూ. 45 లక్షలు విలువ చేసే గసగసాలు గడ్డి, MDMA డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 

నిందితులు ఓం రామ్,  సన్వాలా రామ్ గా గుర్తించామని వారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారని చెప్పారు. వికాస్ అనే మధ్య ప్రదేశ్ కు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. ప్రధాన నిందితులు ఇద్దరు కార్పెంటర్,  రైలింగ్ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని వెల్లడించారు. ఓం రామ్ పై రాజస్థాన్లో డ్రగ్స్ కేసులు ఉన్నాయని ఆర్థిక సమస్యల కారణంగా  డ్రగ్స్ విక్రయించడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారని విచారణలో తెలిసిందన్నారు.

 డ్రగ్స్ సప్లై చేసే వికాస్ నుండి నిందితులు ఇద్దరు డ్రగ్స్ కొనుగోలు చేసి ప్రజా రవాణా మార్గం ద్వారా మధ్యప్రదేశ్ నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చేవారని చెప్పారు.  బస్సుల్లో, లారీల్లో, ట్రైన్ లలో మధ్యప్రదేశ్ నుంచి నగరానికి డ్రగ్స్ రవాణా చేసేవారని తెలిపారు. అలా తెప్పించిన డ్రగ్స్ ను నగరంలో అవసరమైన వారికి విక్రయించేవారని వెల్లడించారు. పక్కా సమాచారంతో SOT ఎల్ బీ నగర్ బృందం జవహర్ నగర్ పోలీసులతో కలిసి తిమ్మాయిపల్లి  వైపు వెళ్తున్న సమయంలో నిందితులను పట్టుకున్నారని తెలిపారు. 

వారి వద్ద నుండి 40 కేజీల గసగసాల గడ్డి, 10గ్రాముల MDMA, మొబైల్ ఫోన్‌లు సీజ్ చేశామన్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. నిందితులపై పీడియాక్ట్ పెడతామన్నారు.