ప్రైవేటు ల్యాబ్లలో కరోనా టెస్టులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా టెస్టులు చేసేందుకు ప్రైవేటు ల్యాబ్లు సిద్ధమవుతున్నయి. వీలైనంత త్వరగా టెస్టులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నెల 30వ తేదీ నుంచి కరోనా టెస్టులను ప్రారంభించినున్నట్టు విజయ డయాగ్నస్టిక్స్శుక్రవారం ప్రకటించింది. విజయాతోపాటు రాష్ట్రంలోని అపోలో జూబ్లీహిల్స్, బోయిన్పల్లి సెంటర్లు, విమ్టా డయాగ్నస్టిక్స్, డాక్టర్ రెమిడీస్, పాథ్కేర్ ల్యాబ్స్, సిటిజన్ హాస్పిటల్లోని అమెరికన్ ల్యాబ్లలో కరోనా టెస్టులు చేసేందుకు కేంద్రం ఇంతకుముందే అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో గాంధీ హాస్పిటల్లో మాత్రమే కరోనా టెస్టులు చేస్తుండగా.. శనివారం నుంచి ఫీవర్ హాస్పిటల్, నారాయణగూడలోని ఐపీఎం, నిమ్స్, ఉస్మానియా హాస్పిటళ్లలోనూ చేయనున్నారు. వాటిల్లో నిర్వహించిన ట్రయల్ టెస్టులు సక్సెస్ కావడంతో ఐసీఎంఆర్ ఫైనల్ అప్రూవల్ ఇచ్చింది. త్వరలో టెస్టులు మొదలుపెట్టనున్నారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా టెస్టులకు అవసరమైన కిట్లు చాలా తక్కువగా ఉన్నయి. అన్ని రాష్ట్రాలకు ఐసీఎంఆర్ మాత్రమే కిట్లను పంపిస్తుండగా.. వారం రోజుల్లో ప్రైవేటుగానూ కిట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.
ఒక్కో టెస్టుకు రూ.4,500
కరోనా టెస్టులు చేసేందుకు అనుమతి పొందిన ప్రైవేటు ల్యాబ్లు సొంతగానే టెస్టింగ్కిట్లను సమకూర్చుకోవాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఒక్కో టెస్టుకు గరిష్టంగా రూ.4,500 మాత్రమే చార్జి చేయాలని నిబంధన పెట్టింది. అంతేగాకుండా ఎవరికి పడితే వారికి టెస్టులు చేయడానికి వీలు లేదు. డాక్టర్ పరీక్షించి, టెస్ట్ అవసరమని నిర్ధారించిన వాళ్లకు మాత్రమే చేయాల్సి ఉంటుంది. టెస్ట్ రిజల్ట్ను కూడా నేరుగా పేషెంట్కు ఇవ్వకూడదని, రిఫర్ చేసిన డాక్టర్కు మాత్రమే ఇవ్వాలని ఐసీఎంఆర్ సూచించింది. మార్చి 30 నుంచి టెస్టులు చేస్తామని ప్రైవేటు ల్యాబ్లు ప్రకటించినప్పటికీ.. ప్రభుత్వ దవాఖానాల్లో చేయలేనప్పుడే ప్రైవేటుకు అవకాశం ఇస్తామని సీఎం కేసీఆర్ శుక్రవారం మీడియా సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ (రివర్స్ ట్రాన్స్క్రిప్టెస్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్) పద్ధతిలో కరోనా డయాగ్నసిస్ టెస్టులు చేస్తున్నారు. ఈ పద్ధతిలో టెస్టు రిజల్ట్ రావడానికి 6 గంటల నుంచి 7 గంటలు పడుతుందని నిమ్స్మైక్రో బయాలజిస్ట్ డాక్టర్ ఉష తెలిపారు.
For More News..