- ప్రపోజల్స్ రెడీ చేసిన సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: యునెస్కో గుర్తింపు రావడంతో రామప్ప టెంపుల్డెవలప్మెంట్దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పలు అభివృద్ధి పనులను ప్రతిపాదిస్తూ ఫైల్ తయారు చేసింది. సెంట్రల్ అర్కియాలజీ, టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆఫీస్కు ఫైల్ పంపించారు. రామప్ప టెంపుల్ చుట్టూరా ఉన్న 14.5 ఎకరాల ల్యాండ్ సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది. రామప్ప గుడికి అతి సమీపంలోనే కామేశ్వర, కాటేశ్వర గుడులు ఉన్నాయి. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగనుంది. విదేశీయులను ఆకట్టుకోవడానికి, వారికి సరైన వసతి సౌకర్యాలు కల్పించడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు చెందిన ఆఫీసర్లు రూ.80 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. ఈ నిధులతో కాటేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించడంతో పాటు ప్రధాన టెంపుల్కు దగ్గరలో ఉన్న అనుబంధ ఆలయాలను అభివృద్ధి చేస్తారు. అలాగే ప్రధాన గుడి గోపురంపై కనిపిస్తున్న నల్ల రంగును పోగొట్టడానికి కెమికల్స్తో కడుగుతారు. తూర్పు, ఉత్తర దిశలో బురద నీటిలో ఉన్న శిల్పాలను తిరిగి ఎక్కడికక్కడ అమర్చుతారు. అలాగే మొత్తం 14.5 ఎకరాలను అభివృద్ధి చేయడంతోపాటు లింక్ రోడ్లు వేస్తారు. ఖాళీ స్థలాన్ని పచ్చని గార్డెన్గా తీర్చి దిద్దుతారు. పూల తోటలు పెంచుతారు. గుడి చుట్టూరా పడిపోయి ఉన్న ప్రహరీని కూడా పునర్నిర్మిస్తారు.
మధ్యలో ఆగిపోయిన పనులు
రామప్పకు 2019 సెప్టెంబర్ 25, 26 తేదీల్లో యునెస్కో బృందం వస్తుందని తెలిసి స్టేట్ గవర్నమెంట్ కొన్ని నిధులను విడుదల చేసింది. రూ.80 లక్షలతో పాలంపేట‒ములుగు ప్రధాన రహదారి నుంచి రామప్ప మెయిన్ టెంపుల్ వరకు 2 వరసల రోడ్డు, మధ్యలో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పనులను స్టార్ట్ చేశారు. రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు పనులు పూర్తికాలేదు. వేసిన రోడ్డులో సగం ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో కాంట్రాక్టర్ పనులు చేయకుండా ఆపేశారు. రూ.5 కోట్లతో రామప్ప సరస్సు మధ్యలో ఉన్న 15, 20 ఎకరాల ఐలాండ్లో ధ్యాన మందిరం, కోటిలింగాల గుడిని నిర్మిస్తామని స్టేట్ గవర్నమెంట్ ప్రకటించింది. అలాగే రామప్ప సరస్సు ఒడ్డు నుంచి ఐలాండ్ వరకు రోప్వే నిర్మిస్తామని, శిల్పారామం ఏర్పాటు చేసి కాకతీయుల చరిత్ర, కాకతీయ రాజుల శిల్పాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. రెండేళ్లు గడుస్తున్నా ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు. పనులు మొదలుపెట్టలేదు. రూ.40 లక్షలతో ఏకోపార్కు నిర్మిస్తామని ప్రకటించారు. 4 వేల మూలిక మొక్కలను పెంచి పిల్లలు, స్టూడెంట్లకు అవగాహన కల్పిస్తామని అన్నారు. రెండేళ్లు అవుతున్నా ఇంకా స్థలమే ఖరారు చేయలేదు. వెహికల్ పార్కింగ్ కోసం రామప్పలో 5 ఎకరాల భూమిని కేటాయిస్తామని స్టేట్ గవర్నమెంట్ ప్రకటించింది. రెండేళ్లలో ఒక్క గుంట స్థలం కూడా కేటాయించలేదు. రామప్ప చూడటానికి వస్తున్నవారి వెహికల్స్ అన్నీ ఇప్పటికీ టెంపుల్ వెనుక వైపు ఉన్న మెయిన్రోడ్డు పైనే పార్కింగ్ చేస్తున్నారు. సెంట్రల్నుంచి ఫండ్స్వస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. కేంద్ర ప్రభుత్వంలో ఆర్కియాలజీ, టూరిజం శాఖ మన రాష్ట్రానికే చెందిన కిషన్ రెడ్డి పర్యవేక్షిస్తుండటం వల్ల భవిష్యత్లో రామప్ప టెంపుల్ దశ, దిశ తిరిగేలా అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉన్నట్లుగా ఆఫీసర్లు పేర్కొంటున్నారు.
కేసీఆర్ పైసా ఇవ్వలే
రామప్ప టెంపుల్కు జులై 25న యునెస్కో గుర్తింపు వచ్చింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోనే యునెస్కో గుర్తింపు పొందిన మొదటి కట్టడంగా రామప్ప నిలిచింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. యునెస్కో గుర్తింపు వచ్చి 25 రోజులు గడుస్తున్నా స్టేట్ గవర్నమెంట్లో కదలిక లేదు. టెంపుల్ పరిసరాల అభివృద్ధి కోసం నయా పైసా కేటాయించలేదు. ముగ్గురు రాష్ట్ర మంత్రులు రామప్పకు వచ్చి పూజలు చేసి వెళ్లిపోయారు. ఇదంతా తమ సార్(కేసీఆర్) ఘనతే అని చెప్పుకున్నారే తప్ప పైసల ముచ్చటే తీయలేదు. రామప్ప టెంపుల్ అభివృద్ధి కోసం రూ.250 కోట్లు మంజూరు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ని కోరతామని చెప్పారే కానీ స్టేట్ ఫైనాన్స్ నిధులు ఎన్ని కేటాయిస్తారో మాటకైనా చెప్పలేదు. గతంలో మొదలు పెట్టగా ఆగిపోయిన అభివృద్ధి పనులను కూడా పట్టించుకోలేదు. కనీసం కాంట్రాక్టర్లను, ఆఫీసర్లను పిలిచి త్వరగా పనులు కంప్లీట్ చేయాలని కూడా ఆదేశించలేదు.