హైదరాబాద్ శివారులో రూ.9కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ శివారులో  రూ.9కోట్ల విలువైన  డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్: నగర శివారులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. శుక్రవారం డ్రగ్స్ కంట్రోల్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ పోలీస్ అధికారులు నగరంలో జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. డ్రగ్స్ ను నిల్వ ఉంచిన స్థావరంపై దాడులు చేశారు. ఇంటర్ పోల్ నుంచి వచ్చిన సమాచారంతో సంగారెడ్డి జిల్లా బొల్లారంలో PSN మెడికర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు చేశారు. భారీగా నిల్వ చేసిన సైకో ట్రోపిక్, 3- మిథైల్మెల్ కాథినోన్ డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

యూరప్ కు భారీ మొత్తంలో ఎగుమతి చేసేందుకు నిల్వ ఉంచిన రూ.9 కోట్ల విలువైన 90.48 కేజీల డ్రగ్స్ గుర్తించి సీజ్ చేశారు. పదేళ్లుగా డ్రగ్స్ దందా చేస్తున్న నిందితుడు కస్తూరిరెడ్డిని  అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిగరెట్ ప్యాకెట్ల మాటున విదేశాలకు డ్రగ్స్ తరలించడంతోపాటు నగరంలోనూ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.