- ముస్లింలు, క్రిస్టియన్లూ ఆర్ఎస్ఎస్లో చేరవచ్చని క్లారిటీ
- జాతీయ జెండాను గౌరవిస్తం, కాషాయ జెండా తమ గురువని వెల్లడి
బెంగళూరు: హిందూ ధర్మం ఎక్కడా రిజిస్టర్ కాలేదు.. ఆర్ఎస్ఎస్ ను కూడా ప్రత్యేకంగా రిజిస్టర్ చేయాల్సిన అవసరంలేదని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్అన్నారు. ఆర్ఎస్ఎస్1925లో పుట్టింది. అప్పటి బ్రిటీష్ ప్రభుత్వంతో రిజిస్ట్రేషన్ చేయించలేదు.. ఇండిపెండెన్స్తర్వాత కూడా భారత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయలేదన్నారు.
బెంగళూరులో ఆదివారం ‘‘100 ఇయర్స్ ఆఫ్ సంఘ్ జర్నీ: న్యూ హారిజాన్స్’’ అనే అంశంపై ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ఇన్-హౌస్ సెషన్లో ఆయన పలు ప్రశ్నలకు జవాబిచ్చారు. గతంలో మూడుసార్లు ప్రభుత్వాలు ఆర్ఎస్ఎస్ను నిషేధించగా కోర్టులు ఎత్తేశాయని చెప్పారు. మరి గుర్తింపులేకుండా బ్యాన్ ఎలా చేశారు? అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ను వ్యక్తుల సమూహంగా గుర్తించి ఆదాయపు పన్ను శాఖ పన్ను మినహాయింపు ఇచ్చిందన్నారు. ఆర్ఎస్ఎస్ చట్టబద్ధ సంస్థ అని రాజ్యాంగేతర సంస్థ కాదన్నారు.
‘‘బ్రాహ్మణులు, ఇతర కులాల వారు, ముస్లింలు, క్రిస్టియన్లను ఎదో ఒక ప్రత్యేక గుర్తింపుతో అనుమతించం. శాఖకు వచ్చేటప్పుడు వారి ప్రత్యేక గుర్తింపులు వదిలి భారతమాత కుమారుడిగా రావాలి. హిందూ అంటే మతం కాదు. భారతీయులందరూ హిందూవులే. ముస్లింలు, క్రిస్టియన్లు శాఖలకు వస్తారు. కానీ శాఖలో హిందూ సమాజ సభ్యులుగా ఉండాలి. సమాజ ఏకత్వానికి ఇది మార్గం” అని భాగవత్ స్పష్టం చేశారు.
ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వం
‘‘మేము ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వం. మేము ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనం. సంఘ్ సమాజాన్ని ఏకం చేయడానికి పనిచేస్తుంది. మేము అయోధ్యలో రామమందిరాన్ని కోరుకున్నం, కనుక మా స్వయంసేవకులు దాని నిర్మాణంలో నిలబడిన వారికి ఓటు వేశారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి ఉంటే, ఆ పార్టీకి ఓటు వేసేవారు” అని భగవత్ అన్నారు. ‘‘మాకు ఒక పార్టీ పట్ల ప్రత్యేక
అనుబంధం లేదు. సంఘ్కు పార్టీ లేదు. ఏ పార్టీ కూడా సంఘ్ది కాదు” అని ఆయన అన్నారు.
