కరీంనగర్: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టిన సంఘటన కరీంనగర్ లో జరిగింది. కరోనా కట్టడి క్రమంలో డ్రైవర్ శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకుంటుంటే ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులుండగా.. ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల డిపోకు చెందిన నాన్ స్టాప్ ఆర్టీసీ బస్సు శుక్రవారం సాయంత్రం సిరిసిల్ల నుంచి కరీంనగర్ వెళ్తుంది.
వేములవాడ మండలం అగ్రహారం సమీపంలోని కరీంనగర్ పాలడెయిరీ వద్ద డ్రైవర్ స్టీరింగ్ విడిచిపెట్టి చేతులకు శానిటైజర్ రాసుకుంటుండగా బస్సు అదుపుతప్పి డివైడర్ ఎక్కింది. దీంతో ఒక్కసారి ప్రయాణికులు భయందోళనకు గురికాగా.. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపేశాడని తెలిపారు ప్రయాణికులు. అయితే.. నాన్ స్టాప్ సర్వీసులకు కండక్టర్లు లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపాడు ఆర్టీసీ డ్రైవర్.