ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రభుత్వ ప్రోత్సాహం, కార్మికుల శ్రమ, ప్రయాణికుల ఆదరణతో ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడుతోందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్​ అన్నారు.  మంగళవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో ఆర్టీసీ బస్టాండ్, డిపోలను పరిశీలించారు. ఈ సందర్భంగా  ఆర్టీసీ చైర్మన్​ మీడియాతో మాట్లాడుతూ గతంలో రాష్ట్ర్రంలోని  91 డిపోలు నష్టాల్లో ఉండగా, ప్రస్తుతం 41డిపోలు లాభాల్లోకి వచ్చాయన్నారు. ఆర్థికపుష్టితో ప్రతి నెలా టైంకు జీతాలు ఇస్తున్నామని చెప్పారు. ప్రయాణికుల 
ఆదాయంతోపాటు కార్గో, లాజిస్టిక్, ఇతర సేవల ద్వారా అదనపు లాభం సమకూర్చుకుంటున్నామన్నారు.  డెయిలీ రూ.14కోట్ల ఆదాయం వస్తోందని, మరో రూ.4కోట్లు ఆదాయం పెరిగితే సంస్థ లాభాల్లోకి చేరుకుంటుందన్నారు. బస్టాండ్లల్లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గతంలో కరీంనగర్ జోన్ లో రూ.561కోట్ల నష్టం ఉంటే ప్రస్తుతం రూ.156కోట్లకు తగ్గిందని వివరించారు. నష్టాలను తగ్గించుకునేందుకు కృషి చేసిన ఉద్యోగులు, అధికారులను అభినందించారు. 

నేటి నుంచి శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు

వేములవాడ, వెలుగు :  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో  సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాలు నేటి నుంచి  ప్రారంభం కానున్నాయి.  ఐదు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో సుప్రసిద్ధ కళాకారులతో  శాస్త్రీయ, భక్తి, సంగీత, జంత్రవాద్య, సోలో, హరికథ, నృత్య,  హరికథ, నాటక,  ఉపన్యాస, సాంస్కృతిక,  సాహిత్య కార్యక్రమాలుంటాయి.  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 70 ఏండ్లుగా ఏటా శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక సంగీతంలో ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ వాగ్దేయకారుడు త్యాగరాజు రచించిన శ్రీ రామ కీర్తనలు ఎంతో గుర్తింపు నిచ్చాయి.  కర్ణాటక సంగీతంలో ఎంతో పేరు ప్రతిష్టతలు సంపాదించిన శ్రీ త్యాగ రాజస్వామి వారి జయంతిని సంగీత దినంగా, అరాధనోత్సవాలు నిర్వహిస్తారు. 

మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు నిరసన సెగ

బోయినిపల్లి, వెలుగు: బోయినిపల్లి మండలం కొదురుపాకలో మంత్రి కేటీఆర్ పర్యటనకు నిరసన సెగ తాకింది. గ్రామంలో కేటీఆర్ అమ్మమ్మ, తాతయ్యల జ్ఞాపకార్థం నిర్మిస్తున్న ప్రైమరీ స్కూల్​భవన నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు మంగళవారం మంత్రి వచ్చారు. ఈ సందర్భంగా మిడ్ మానేర్ ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముంపు గ్రామాల జేఏసీ ఉపాధ్యక్షుడు, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు కొండం శ్రీనివాస్ రెడ్డి ఫ్లెక్సీతో నిరసన తెలిపారు. అలర్ట్ అయిన పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.
 

విలీన గ్రామాల అభివృద్ధికి కృషి : మేయర్ యాదగిరి సునీల్ రావు

కరీంనగర్ టౌన్, కొత్తపల్లి, వెలుగు: కార్పొరేషన్‌‌‌‌లో విలీనమైన 8 గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని  కరీంనగర్​మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. మంగళవారం 18 వ డివిజన్  రేకుర్తిలోని శ్మశానవాటికలో  రూ.50లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను కమిషనర్ సేవా ఇస్లావత్ తో కలిసి మేయర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం రూ.15 కోట్లతో  కులమతాలకతీతంగా శ్మశాన వాటికలను సుందరీకరిస్తున్నామన్నారు. శ్మశాన వాటికలో స్నానపు గదులు, కర్మకాండల కోసం ప్రత్యేక షెడ్స్, బర్నింగ్ ప్లాట్ ఫామ్, మరుగు దొడ్ల సౌలత్‌‌‌‌లు కల్పిస్తామన్నారు. విలీన గ్రామాల డివిజన్లలో తాగు నీటి పైపు లైన్ పనులు 75శాతం  పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను వేసవిలోగా పూర్తి చేస్తామన్నారు. అనంతరం బల్దియాలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ప్రతీ వ్యాపారి ట్రేడ్ లైసెన్స్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మేయర్​ ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ నాగమల్లేశ్వర్ రావు, ఈఈ మహేందర్, డీఈ మసూద్ అలీ, కార్పొరేటర్లు  రాజశేఖర్, మాధవి పాల్గొన్నారు.


మంత్రి గంగులకు కేటీఆర్​ పరామర్శ 

కరీంనగర్ టౌన్, వెలుగు: బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని గంగుల కమలాకర్ ఇంటికి చేరుకొని, మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గంగుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్,  ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ సునీల్ రావు, రవీందర్ సింగ్ ఉన్నారు. 

శిలాఫలకానికి నల్లా పెట్టి నిరసన

కరీంనగర్ టౌన్, వెలుగు: విలీన గ్రామం తీగలగుట్టపల్లి డివిజన్ కు మున్సిపల్ తాగునీటి పైపులైన్​ నిర్మాణం కోసం భూమి పూజ చేసి ఏడాదైంది. అయితే ఆ పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదు. సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం శిలాఫలకానికి ఓ నల్లాపెట్టి దాని నుంచి నీరు తాగుతూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, సమద్ నవాబ్, తాజొద్దిన్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, లింగంపల్లి బాబు పాల్గొన్నారు.

స్కూళ్లలో పెండింగ్ పనులు పూర్తి  చేయాలి:   కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ

గోదావరిఖని, వెలుగు: ‘మన ఊరు మన బడి’కి జిల్లాలో ఎంపిక చేసిన స్కూళ్లలో సంక్రాంతి నాటికి పనులు పూర్తిచేసి ప్రారంభానికి రెడీ చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.  మంగళవారం రామగుండం, అంతర్గాం మండలాల్లో కలెక్టర్​పర్యటించారు. గోదావరిఖని విఠల్ నగర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్‌‌‌‌‌‌‌‌, రామగుండంలోని ప్రైమరీ స్కూల్‌‌‌‌‌‌‌‌ను సందర్శించిన కలెక్టర్..  మన ఊరు మన బడి కింద చేపట్టిన స్ట్రక్చరల్, చిన్న రిపేర్లను పూర్తిచేయాలన్నారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌ వెంట రామగుండం మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు,  తహసీల్దార్​వేణుగోపాల్, ఎంపీడీవో యాదగిరి, ఏఈ రాజు ఉన్నారు. 

సైన్స్​ ఎగ్జిబిషన్​ప్రారంభం 

జ్యోతి నగర్, వెలుగు: ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల మక్కువ కలిగి ఉండి, ఆవిష్కరణలు రూపొందించేలా విద్యార్థులను టీచర్స్ ప్రోత్సహించాలని పెద్దపల్లి కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. మంగళవారం రామగుండం ఎన్టీపీసీ టౌన్ షిప్ సెయింట్ క్లేర్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అనంతరం స్టూడెంట్స్ రూపొందించిన సైన్స్ ఆవిష్కరణలు కలెక్టర్ తిలకించారు.
 

ప్రైవేటీకరణను అడ్డుకోవడంపై సీఎంకు చిత్తశుద్ధి లేదు: ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ సెక్రెటరీ జనరల్‌‌‌‌‌‌‌‌ బి.జనక్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: తెలంగాణలో బొగ్గు బ్లాక్‌‌‌‌‌‌‌‌లపై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, టీబీజీకెఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు చెబుతున్న మాటలన్నీ బోగస్‌‌‌‌‌‌‌‌ అని ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ సెక్రటరీ జనరల్‌‌‌‌‌‌‌‌ బి.జనక్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ విమర్శించారు.  మంగళవారం గోదావరిఖని  ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన పాల్గొని మాట్లాడారు.  సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను అడ్డుకోవడంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.  ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం అంటూ కార్మికులను మభ్య పెట్టేందుకే సరికొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంఎండీఆర్‌‌‌‌‌‌‌‌  యాక్టును, 2021లో క్యాప్టివ్ మైన్‌‌‌‌‌‌‌‌ల ప్రైవేటీకరణపై ప్రవేశపెట్టిన చట్టాన్ని సంపూర్ణంగా సమర్థించిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణలో పాపం లేదా అని ప్రశ్నించారు. సీఎం అనుమతి లేనిదే బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించరాదని నిబంధన ఉన్నప్పటికీ తెలంగాణలో బొగ్గు బ్లాకుల టెండర్ల ప్రక్రియను సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఎందుకు అడ్డుకోవడం లేదని నిలదీశారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌లో లీడర్లు ధర్మపురి, లక్ష్మీపతి గౌడ్, కె.సదానందం, కృష్ణ, శ్రీనివాస్, కృష్ణ, మనోహర్, రాజయ్య, అల్లావుద్దీన్, ఆంజనేయులు, రాజేశం, సంజీవరావు, అనిల్, ప్రసాద్  పాల్గొన్నారు.

పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలి

మెట్ పల్లి, వెలుగు: రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సర్కారు ఆరు నెలల ఏరియర్స్  డబ్బులు చెల్లించి, వారసత్వ హక్కు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ అవుట్​సోర్సింగ్​వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏసురత్నం డిమాండ్ చేశారు. మంగళవారం మెట్‌‌‌‌పల్లి మున్సిపాలిటీ వద్ద ఏఐటీయూసీ జిల్లా లీడర్​రాజలింగం మొదటి వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు సుతారి రాములుతో కలిసి ఏసురత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ శాఖలో  పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్​ సోర్సింగ్  కార్మికులకు 11వ పీఆర్సీ  వర్తింపజేయాలని డిమాండ్ ​చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నేతలు ఎండి ఉస్మాన్, మధురమ్మ, బర్ల రవి, సాయిలు పాల్గొన్నారు.

సిద్దార్థలో సంక్రాంతి వేడుకలు

కరీంనగర్ టౌన్, వెలుగు: భగత్ నగర్‌‌‌‌‌‌‌‌లోని సిద్దార్థ ఇంగ్లీష్​ మీడియం స్కూల్ లో మంగళవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. స్కూల్‌‌‌‌ను రంగవల్లులు, మామిడితోరణాలతో సుందరంగా అలంకరించారు. స్కూల్ అకాడమిక్  డైరెక్టర్ దాసరి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు విద్యార్థులకు తెలియజెప్పాలన్నారు. వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 


స్టేట్ లెవల్ సైన్స్‌‌‌‌ ఫెయిర్‌‌‌‌‌‌‌‌కు మానేర్ ​స్టూడెంట్​

కరీంనగర్ టౌన్, వెలుగు: రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌‌‌‌‌‌‌‌కు తమ స్టూడెంట్​సెలక్ట్​అయిందని మానేర్ విద్యాసంస్థల చైర్మన్ కడారు అనంతరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక మంకమ్మతోటలోని సాయిమానేర్ స్కూల్ లో నిర్వహించిన అభినందన సభలో డైరెక్టర్ సునీతారెడ్డితో కలిసి చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి చదువుతున్న సాయిశ్రీనికను అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సరితారెడ్డి,టీచర్స్,స్టూడెంట్స్ పాల్గొన్నారు.

బీజేపీని చూస్తే కేటీఆర్​కు ముచ్చెమటలు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సెస్ ఎన్నికల్లో బీజేపీ 30% ఓట్లు రావడంతో.. రాష్ట్ర మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు ముచ్చెమటలు పడుతున్నాయని  కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్​ రావు అన్నారు.  మంగళవారం సెస్  ప్రమాణస్వీకారోత్సవంలో కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రవీణ్​ రావు  మీడియాతో మాట్లాడారు.  సెస్  ఫలితాలలో  బీజేపీ ఇచ్చిన టఫ్ ఫైట్‌‌‌‌తో కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు భయం పట్టుకుందన్నారు. ఆ భయంతోనే కేటీఆర్  ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.  గతంలో కరీంనగర్​ ఎంపీగా ఉన్న సీఎం కేసీఆర్​కంటే ప్రస్తుత ఎంపీ బండి సంజయ్​మెరుగ్గా పనిచేస్తున్నారని, కేంద్రం నుంచి రూ.వేల కోట్లు తెచ్చి పార్లమెంట్ నియోజకవర్గాన్ని డెవలప్​ చేస్తున్నారన్నారు.  సిరిసిల్ల , వేములవాడ నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగుల కోసం అవసరమైన పరికరాలను కేంద్ర ప్రభుత్వ సాయంతో అందించారు.  రాష్ట్రంలో 9 ఏళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కరీంనగర్ కు , సిరిసిల్ల నియోజకవర్గానికి మంత్రి కేటీఆర్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో సిరిసిల్ల నియోజవర్గంపై కాషాయ జెండా ఎగరవేస్తామని, ఆ దిశగా కార్యచరణలతో ముందుకు వెళ్తున్నామని ప్రవీణ్​రావు తెలిపారు.

మందుబాబులకు అడ్డాగా సబ్‌‌స్టేషన్​

కోనరావుపేట, వెలుగు: కోనరావుపేట మండలం బావుసాయిపేట విద్యుత్​సబ్ స్టేషన్ మందుబాబులకు అడ్డాగా మారింది. సబ్​స్టేషన్‌‌లో మందు మత్తులో ఓ వ్యక్తిని చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం సాయంత్రం సబ్ స్టేషన్ ఆవరణలో ఆపరేటర్ నందకుమార్‌‌‌‌తో గ్రామానికి చెందిన వెంకటేశం, మరికొందరు లిక్కర్​ తాగారు. అనంతరం ఇదే గ్రామానికి చెందిన లాల సంజీవ్‌‌ను దావత్ ​ఉందని పిలిచి చితకబాదారు. తనపై దాడికి పాల్పడినట్లు బాధితుడు సంజీవ్ పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై ఎన్పీడీసీఎల్ ఏడీ ప్రదీప్ ను వివరణ కోరగా సబ్​స్టేషన్‌‌లో జరిగిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

ముగ్గురి ప్రాణాలను కాపాడిన కార్మికుడికి సన్మానం

గోదావరిఖని, వెలుగు:  గోదావరిలో దూకిన తల్లీ, ఇద్దరు పిల్లలను ప్రాణాలకు తెగించి కాపాడిన సింగరేణి గని కార్మికుడు ఈరవేణి శ్రీనివాస్‌‌‌‌ను సింగరేణి అధికారులు, యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు. మంగళవారం ఆర్జీ 2 ఆఫీస్‌‌‌‌లో, జీడికె 7 ఎల్‌‌‌‌ఈపీ గనిపై, గోదావరిఖని మెయిన్‌‌‌‌ చౌరస్తా వద్ద శ్రీనివాస్‌‌‌‌ను సన్మానించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాలలో జీఎం మనోహర్‌‌‌‌, టీబీజీకెఎస్‌‌‌‌ జనరల్‌‌‌‌ సెక్రటరీ రాజిరెడ్డి, ఏజెంట్‌‌‌‌ శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్‌‌‌‌, రాజేంద్ర ప్రసాద్‌‌‌‌, కార్పొరేటర్‌‌‌‌ భాస్కర్‌‌‌‌ పాల్గొన్నారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను విస్మరించింది

కరీంనగర్ టౌన్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను విస్మరించిందని  బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్ ఆరోపించారు.  మంగళవారం కరీంనగర్​ కలెక్టరేట్ ఎదుట మోర్చా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 ఏండ్ల కేసీఆర్​పాలనలో బీసీల కులవృత్తులను గాలికొదిలేశారన్నారు. బీసీ కార్పొరేషన్ నుంచి  లోన్లు మంజూరు చేయడంలో బీఆర్ఎస్​ప్రభుత్వం ఫెయిలైందన్నారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా శాఖ అధ్యక్షుడు దూలం కల్యాణ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు జి.కృష్ణారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ రావు తదితరులుపాల్గొన్నారు.

'ఖని'లో అడ్వకేట్ల నిరసన

గోదావరిఖని, వెలుగు: వరంగల్ అడ్వకేట్‌‌‌‌‌‌‌‌ కొత్తపల్లి రాజును పోలీసులు నడిరోడ్డుపై కొట్టడాన్ని నిరసిస్తూ గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడ్వకేట్లు మంగళవారం విధులు బహిష్కరించారు. మున్సిఫ్ కోర్టు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు చందాల శైలజ మాట్లాడుతూ న్యాయాన్ని రక్షిస్తున్న అడ్వకేట్లపై పోలీసుల దాడులు హేయమైన చర్య అని, దాడికి పాల్పడిన పోలీసులను సస్పెండ్ చేయడంతో పాటు వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు గుర్రాల రాజేందర్, చెలకల పద్మజ, భాష, అనురాధ, గుడికందుల భూమయ్య, అంజయ్య దేశెట్టి, ఎండి ఉమర్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.