మాస్కో: ఉక్రెయిన్తో యుద్ధ పరిస్థితులు దాదాపు ముగిసిపోయినట్టేనని రష్యా ప్రకటించింది. క్రిమియాలో చేపట్టిన మిలటరీ డ్రిల్స్ పూర్తయిపోయాయని, బలగాలు పూర్తిగా వెనక్కు వచ్చేస్తున్నాయని ఆ దేశ రక్షణ శాఖ బుధవారం ప్రకటించింది. సైన్యం, ఆయుధాలన్నీ సదరన్ రష్యాలోని బేస్కు చేరుకుంటున్నాయని తెలిపింది. యుద్ధ ట్యాంకులు, సైన్యాన్ని
తరలించే వెహికల్స్, సెల్ఫ్ ప్రొపెల్డ్ ఇన్స్టాలేషన్స్ను రైళ్లలో బేస్లకు పంపిస్తున్నట్టు వెల్లడించింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించిన లక్షన్నరకు పైగా బలగాలను రష్యా మంగళవారం వెనక్కు తీసుకొచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బుధవారం పూర్తిగా బలగాలను వెనక్కు తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. సైన్యం వెనక్కు వెళ్లిపోతున్న వీడియోలను
విడుదల చేసింది.
బలగాల వాపస్ డౌటే: నాటో
బలగాలన్నింటినీ వాపస్ తీసుకొస్తున్నట్టు రష్యా ప్రకటించినా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) మాత్రం అనుమానాలను వ్యక్తం చేసింది. ఎక్కడా బలగాల వాపస్ అన్నది తమకు కనిపించడం లేదని, ఉక్రెయిన్ మీద దాడి జరిగే ముప్పు ఇంకా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ రష్యా చెప్తున్నట్టు బలగాలు వెనక్కు వచ్చేస్తే మంచిదేనని, కానీ, ప్రస్తుతం అలాంటి పరిస్థితులేవీ కనిపించడం లేదని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ అన్నారు. ఉక్రెయిన్సహా నాటోలోని దేశాలు అదే డౌట్ను వ్యక్తం చేశాయి.
ముప్పు ఇంకా పోలే: బైడెన్
ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసే ముప్పు ఇంకా పోలేదని, దాడి చేసే అవకాశాలు ఇంకా ఉన్నాయని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. డిప్లొమాటిక్ చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని, కాదని దాడి చేస్తే రష్యాపై ఆంక్షలు పెట్టేందుకూ వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు.
మేమూ యుద్ధాన్ని కోరుకోవట్లేదు: పుతిన్
రష్యా కూడా యుద్ధాన్ని కోరుకోవట్లేదని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితులపై జర్మనీ చాన్స్లర్ ఓలాఫ్ షోల్జ్తో సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డిప్లొమాటిక్ చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఎన్నో ఏండ్లుగా యూరప్ పై మిసైల్స్ నిషేధం, మిలటరీ డ్రిల్స్ మీద ఆంక్షలు వంటి విషయాలపై చర్చించేందుకు ఎన్నో ఏండ్లుగా ప్రయత్నిస్తున్నా సాధ్య పడడం లేదన్నారు. వాటికి ఓకే అంటే ఈ సమస్యపైనా చర్చించేందుకు సిద్ధమేనని
స్పష్టం చేశారు.
ప్రశాంతంగా బతకాలనుకుంటున్నం: ఉక్రెయిన్ ప్రెసిడెంట్
దేశంపై రష్యా దండెత్తి వచ్చే ప్రమాదం ఉందంటూ కొందరు అధికారులు సమాచారం ఇచ్చారని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. తాము ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా బతకాలని అనుకుంటున్నామని చెప్పారు. బుధవారం నేషనల్ యూనిటీ డే సందర్భంగా 200 మీటర్ల పొడవైన జెండాను ప్రజలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అందరం కలిసికట్టుగా ఉంటేనే ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టగలమని జనానికి సూచించారు. కాగా, దేశమంతటా ఉక్రెయిన్ బలగాల ఎక్సర్సైజులు కొనసాగుతూనే ఉంటాయని ఆ దేశ రక్షణ మంత్రి ఒలెస్కీ రెజ్నికోవ్ చెప్పారు. గురువారం జరగబోయే నాటో డిఫెన్స్ మినిస్టర్ల సమావేశంలో పాల్గొంటానని స్పష్టం చేశారు.
