మాస్కో ఆయిల్ రిఫైనరీపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం.. విమానాలు బంద్.. వారంలోనే రెండోసారి..

మాస్కో ఆయిల్ రిఫైనరీపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం.. విమానాలు  బంద్.. వారంలోనే రెండోసారి..

ఈ వారంలోనే రెండోసారి ఉక్రెయిన్ డ్రోన్లు మాస్కోలోని ఒక చమురు శుద్ధి కర్మాగారాన్ని టార్గెట్ చేసుకుని దాడి చేశాయి. దింతో గురువారం మాస్కోలో దట్టమైన నల్లటి పొగ, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం  వైరల్ అవుతున్నాయి. 
 
ఈ వారం ప్రారంభంలో రష్యా జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో యునెస్కో గుర్తించిన కీవ్-పెచెర్స్క్ లావ్రా మఠంలోని 'డార్మిషన్ కేథడ్రల్' దెబ్బతింది. ఈ ఘటనలో 11 మంది చనిపోయారు. గత కొన్ని నెలలుగా కీవ్ సాంస్కృతిక, పౌర ప్రాంతాలపై రష్యా చేసిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఇదోకటి. దీనికి ప్రతికారంగానే ఉక్రెయిన్ తాజా దాడికి దిగింది. 

దీనిపై జెలెన్స్కీ స్పందిస్తూ... "మన నగరాలపై రష్యా చేస్తున్న దాడులకు ఇది పూర్తిగా సరైన ప్రతిస్పందన. రష్యా యుద్ధ యంత్రాంగాన్ని దెబ్బతీసేందుకు మన సైనికులు చేసిన మరో గొప్ప ప్రయత్నం ఇది" అని ఎక్స్ లో పేర్కొన్నారు.

చర్చలకు రావాలని జెలెన్స్కీ పిలుపు
'ఆపరేషన్ స్పైడర్స్ వెబ్' తర్వాత ఉక్రెయిన్ చేసిన అతిపెద్ద దాడి ఇదేనని భావిస్తున్నారు. ఈ దాడి తీవ్రతను రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అంగీకరించినందున, ఇకనైనా యుద్ధాన్ని ముగించి, చర్చలు-దౌత్య మార్గాల్లోకి రావాలని జెలెన్స్కీ కోరారు.

555 డ్రోన్ల కూల్చివేత.. నిలిచిపోయిన విమానాలు
రష్యా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వివిధ ప్రాంతాల్లో దాదాపు 555 ఉక్రేనియన్ డ్రోన్లను రష్యా సైన్యం కూల్చివేసింది. ఇందులో దాదాపు 200 డ్రోన్లను మాస్కో సమీపంలోనే అడ్డుకున్నారు.

ఈ భారీ డ్రోన్ దాడి కారణంగా మాస్కోలోని కీలక విమానాశ్రయాలు షెరెమెటివో, డొమోడెడోవో, వ్నుకోవో, జుకోవ్స్కీల నుండి అన్ని విమాన సర్వీసులను రష్యా రవాణా శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.

పుతిన్ సమావేశానికి ముందే..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 'కజాన్' నగరంలో ఆసియాన్ (ASEAN) దేశాల నాయకులతో సమావేశం కావడానికి కొన్ని గంటల ముందే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ సదస్సుకు థాయ్‌లాండ్, వియత్నాం, కంబోడియా, లావోస్, మలేషియా, సింగపూర్ ప్రధానులతో పాటు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ హాజరయ్యారు.

ALSO READ : మోడీ సర్కార్ దెబ్బకు 65 శాతం తగ్గిన గోల్డ్ దిగుమతులు..

బుధవారం రాత్రి జరిగిన విందులో పుతిన్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఒక న్యాయమైన వ్యవస్థ కోసం, దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం కోసం రష్యా-ఆసియాన్ దేశాలు కలిసి పనిచేస్తాయని చెప్పారు. నాలుగేళ్లుగా ఉక్రెయిన్‌తో యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో, రష్యా ఆర్థిక వ్యవస్థను, ప్రాంతీయ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఈ రెండు రోజుల సదస్సును నిర్వహిస్తోంది.