మూడు క్షిపణులతో ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. 17 మంది మృతి

మూడు క్షిపణులతో ఉక్రెయిన్‌పై రష్యా దాడి..  17 మంది మృతి

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉత్తర ఉక్రెయిన్ లోని చెర్నిహిల్ నగరంపై బుధవారం రష్యా మూడు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో 17 మంది వరకు మరణించారు. ముగ్గురు చిన్నారులతో  సహా 60 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. రష్యా ఉక్రెయిన్ పౌరులనే టార్గెట్ గా దాడులు చేస్తోందని చెర్నిహిల్ మేయర్ ఒలెక్సాండర్ లోమాకో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులు జరగక ముందు ఉక్రెయిన్ మిత్ర దేశాలను ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ వైమానిక రక్షణ సహాయాన్ని అందించాలని కోరారు.


ఇస్కాండర్ క్రూయిజ్ క్షిపణులతో రష్యా ఈ దాడి చేసింది. ఉక్రెయిన్  రాజధాని కైవ్ సిటీ నుంచి చెర్నిహిల్150 కి.మీ, రష్యా సరిహద్దు నుంచి దాదాపు 80 కి.మీ దూరంలో ఉంటుంది. ఉక్రెయిన్ స్థానిక సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు స్కూల్స్, హాస్పిటల్, ఇళ్లు ఉండే ప్రాంతంలో మూడు క్షిపణులతో దాడి చేసింది. ఈ ప్రమాదంలో ఒక హోటల్ ధ్వంసమైందని అధికారులు తెలిపారు. నివాస భవనాలు, ఆసుపత్రి, విద్యా సౌకర్యం, డజన్ల కొద్దీ ప్రైవేట్ కార్లు దెబ్బతిన్నాయి.