- 71 నుంచి 45 శాతానికి పడిపోయిన సౌత్ డిస్కం
- 13 శాతంతో అతి చిన్న డిస్కంగా ఎన్పీడీసీఎల్
- ఈ వాటాల ఆధారంగానే ఉద్యోగుల సర్దుబాటు
- జూన్ 2 నుంచి అధికారికంగా మొదలు కానున్న రైతు డిస్కం సేవలు
- ముమ్మర ఏర్పాట్లలో సీఎండీ ఫారూఖ్ అలీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కం వాటా 42 శాతంగా తేలింది. దీని వల్ల ఇప్పటికే ఉన్న ఎస్పీడీసీఎల్(దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ) వాటా 71 నుంచి 45 శాతానికి, ఎన్పీడీసీఎల్(ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ)వాటా 29 నుంచి13 శాతానికి పడిపోయాయి. రాష్ట్రంలో గడిచిన ఐదేండ్ల విద్యుత్ వినియోగం ఆధారంగా ఈ వాటాలు తేల్చగా, ఎస్పీడీసీఎల్, రైతు డిస్కంలు మొదటి రెండు స్థానాల్లో నిలవగా, ఎన్పీడీసీఎల్ అతి చిన్న డిస్కంగా అవతరించింది. రైతు డిస్కం సేవలు జూన్ 2 నుంచి అధికారికంగా మొదలు కానున్నాయి.
సీఎండీ ముషారఫ్ అలీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మూడో డిస్కంకు సంబంధించిన పేపర్ వర్క్ ఇప్పటికే పూర్తి కాగా, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్’ నుంచి అన్ని అనుమతులు వచ్చాయి. డిస్కం లైసెన్స్ కోసం తెలంగాణ ఈఆర్సీలో అప్లయ్ చేయగా, ఉద్యోగుల సర్దుబాటుకు సంబంధించిన విధివిధానాలపై కసరత్తు జరుగుతున్నది.
వాటాల ఆధారంగానే ఉద్యోగుల సర్దుబాటు
రాష్ట్రంలో ఇప్పటిదాకా ఎన్పీడీసీఎల్(నార్త్), ఎస్పీడీసీఎల్ (సౌత్) విద్యుత్ పంపిణీ సంస్థలు మాత్రమే ఉండేవి. హైదరాబాద్ కేంద్రంగా సౌత్, వరంగల్ కేంద్రంగా నార్త్ డిస్కంలు పనిచేసేవి. రైతు డిస్కం ఏర్పాటు చేయకముందు సౌత్ డిస్కం వాటా 71 శాతం ఉండగా, నార్త్ డిస్కం వాటా 29 శాతంగా ఉండేది.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఈ రెండు డిస్కంల పరిధిలో ఉన్న 29,05,779 వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లు , 489 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్(ఎల్ఐఎస్) కనెక్షన్లు, 99 హైదరాబాద్ జలమండలి, 1,132 మిషన్ భగీరథ , మున్సిపాలిటీల పరిధిలోని ప్రత్యేక 639 డీటీఆర్ల నీటి కనెక్షన్లు కలిపి 29.08 లక్షల విద్యుత్ కనెక్షన్లను కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కం పరిధిలోకి తెచ్చింది. 2021 నుంచి 2025 వరకు రాష్ట్రంలో జరిగిన విద్యుత్ వినియోగం ఆధారంగా ఈ 3 డిస్కంల వాటాలను అధికారులు లెక్కకట్టారు. ఈవాటాల ఆధారంగానే ఉద్యోగుల సర్దుబాటు చేయనున్నారు.
జిల్లాకో డీఈ, ఉమ్మడి జిల్లాకో ఎస్ఈ
జూన్ 2 నుంచి రైతు డిస్కం సేవలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం జిల్లాకో డివిజనల్ ఇంజినీర్(డీఈ), ఉమ్మడి జిల్లాకో సూపరిండెంట్ఇంజినీర్ (ఎస్ఈ) స్థాయి అధికారులకు బాధ్యతలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. డివిజన్పరిధిలో ఏడీఈ, సబ్ డివిజన్ పరిధిలో ఏఈలను నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ రైతు డిస్కంలో ఉద్యోగుల నియామకంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే డైరెక్టర్ల బోర్డు ఏర్పాటు కాగా, కమర్షియల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, అకౌంట్స్, ఐటీ విభాగం, రెగ్యులేటరీ, పవర్ పర్చేస్ అగ్రిమెంట్లాంటి పనులు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 660 మంది ఇంజినీర్లు, వెయ్యి మంది సిబ్బంది, 340 మంది పరిపాలనా ఉద్యోగులను నియమించాల్సి ఉంది.
రైతు డిస్కంలో పనిచేయడానికి టీజీ ట్రాన్స్ కో, జెన్ కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను పదోన్నతుల ద్వారా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం సీఎండీ ముషారఫ్ ఇప్పటికే విద్యుత్ యూనియన్లతో 2 సార్లు మీటింగ్లు పెట్టారు. రైతు డిస్కంలో చేరిన ఉద్యోగులకు ఏప్రిల్ 1న జీతాలు అందించి ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంచారు.
ముఖ్యంగా సౌత్, నార్త్ డిస్కంలలో పర్మినెంట్ ఉద్యోగులు, ఆర్టిజన్లు కలిపి సుమారు 34 వేల మంది దాకా ఉద్యోగులు ఉన్నారు. ఈ రెండు డిస్కంల నుంచి రైతు డిస్కంలో చేరడానికి ఉద్యోగులు, ఆర్టిజన్లు ఆసక్తి చూపిస్తున్నట్టు ఇంజినీర్లు చెప్తున్నారు.
ఉద్యోగుల నియామకంపై దృష్టి సారించినం
రైతు డిస్కం సేవలు జూన్ 2 నుంచి మొదలు కానున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకున్నాం. కంపెనీ రిజిస్ట్రేషన్, జీఎస్టీ, టిన్, పిన్ నెంబర్లు అన్నీ వచ్చేశాయి. ఏప్రిల్ 1న ఉద్యోగులకు రైతు డిస్కం నుంచే జీతాలు చెల్లించినం. త్వరలోనే ఈఆర్సీ లైసెన్స్ వస్తుంది. ఖరీఫ్ సీజన్ మొదలయ్యేలోపే ఉద్యోగుల సర్దుబాటు పూర్తిచేస్తాం. జిల్లాలు, డివిజన్లవారీగా ఉద్యోగులను నియమించి కార్యాలయాలు ఓపెన్ చేస్తాం - ముషారఫ్ అలీ ఫారూఖీ, రైతు డిస్కం సీఎండీ, హైదరాబాద్

