సద్దుల బతుకమ్మ పూట విషాదంలో పలు గ్రామాలు

సద్దుల బతుకమ్మ పూట విషాదంలో  పలు గ్రామాలు

సద్దుల బతుకమ్మ పూట పలు గ్రామాలు విషాదంలో మునిగిపోయాయి.  నిజామాబాద్​ జిల్లా మక్లూర్​మండలంలో చెరువుకు వెళ్లిన పిల్లలను కోతి తరమడంతో నీటిలో పడి ప్రాణాలు కోల్పోయారు. అలాగే వరంగల్​నగరంలోని రంగసముద్రం చెరువులో ఈతకు వెళ్లిన మరో ఇద్దరు పిల్లలు  చనిపోయారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో బతుకమ్మ పూల కోసం వెళ్లిన యువకుడు తామర పూలు తెంపుతుండగా తీగలు కాళ్లకు చుట్టుకుని మరణించాడు. 

మాక్లూర్, వెలుగు :  నిజామాబాద్​జిల్లా మాక్లూర్ మండలంలోని మామిడిపల్లిలో సోమవారం సాయంత్రం బతుకమ్మ వేడుకలకు సిద్ధమయ్యారు. ఏడో తరగతి చదువుతున్న గ్రామానికి చెందిన బొల్లి రాజేశ్(13),  తొమ్మిదో తరగతి చదువుతున్న పట్టేవార్​అఖిల్​(14) అభిలాష్​ (13) ఎనిమిదో తరగతి చదివే హన్మంత్​(11), డిగ్రీ చదివే దీపక్​ (20) దుర్గా మాత దీక్షలో ఉండి చెరువు దగ్గర మూత్ర విసర్జనకు వెళ్లారు. ఇదే సమయంలో అక్కడున్న కోతులు ఒక్కసారిగా పైకి రాగా భయపడి చెరువులో దూకారు. ఈత వచ్చిన దీపక్  వెంటనే​అభిలాష్​, హన్మంత్​లను కాపాడగలిగాడు. అఖిల్, రాజేశ్​నీటిలో మునిగిపోవడం, దగ్గరలో ఎవరూ లేకపోవడంతో రక్షించలేకపోయాడు. ఈ విషాద ఘటనలో గ్రామంలో బతుకమ్మ వేడుకలు ఆగిపోయాయి. ఎస్ఐ యాదగిరి గౌడ్​ ఘటన స్థలాన్ని పరిశీలించారు.  

ఈతకు వెళ్లి..

వరంగల్​సిటీ  : వరంగల్ నగరంలోని గోవిందరాజుల గుట్ట ప్రాంతానికి చెందిన మాటూరి రామ్ చరణ్ (11) గోల్డెన్​త్రిషోల్డ్ స్కూల్​లో చదువుతున్నాడు. ​ఇతడి తండ్రి బార్​షాపులో పని చేస్తుండగా, తల్లి కూలి పని చేస్తూ ఉంటుంది. అలాగే ఇదే ప్రాంతానికి చెందిన క్రిష్​వీక్షిత్(11) క్రిష్ణ హైస్కూల్​లో ఆరో తరగతి చదువుతున్నాడు. ఇతడి తండ్రి అనిల్​ ప్రైవేట్​ఉద్యోగి. సోమవారం రామ్​చరణ్​, క్రిష్​వీక్షిత్​తో పాటు వీరి స్నేహితుడు యశ్వంత్ ఉదయం 11 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. మధ్యాహ్నం వేళ ఉరుసు రంగసముద్రం చెరువులో సరదాగా ఈతకు వెళ్లారు. ఈత రాకపోవడంతో రామ్ చరణ్,  క్రిష్​వీక్షిత్​గల్లంతు కాగా, యశ్వంత్ ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇవ్వగా నాలుగన్నర గంటల ప్రాంతంలో పోలీసులు గల్లంతైన వారి కోసం వెతికారు.  రామ్ చరణ్ మృతదేహం దొరకగా,  క్రిష్​వీక్షిత్​డెడ్​బాడీ కోసం గాలిస్తున్నారు.  

పూల కోసం వెళ్లి...

జన్నారం : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రేండ్లగూడకు చెందిన ఆకుల వివేక్ (19) సద్దుల బతుకమ్మ సందర్భంగా సోమవారం ఉదయం తామర పూల కోసం తన స్నేహితుడు గంగాధర్ తో కలిసి గ్రామ సమీపంలోని ధర్మారం చెరువులోకి దిగాడు. పూలు తెంపుతుండుగా లోపల తీగలు కాళ్లకు చుట్టుకోవడంతో నీట మునిగాడు. వెంట వెళ్లిన స్నేహితుడు  కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న గ్రామస్తులు చెరువులోకి దిగి వివేక్ ను బయటకు తీశారు. అప్పటికే ఊపిరాడక వివేక్ చనిపోయాడు. ఆకుల సతీశ్, అమృత దంపతుల ఇద్దరు కొడుకుల్లో వివేక్ పెద్దవాడు. వివేక్ తండ్రి ఆకుల సతీశ్​రెండేండ్ల కింద బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు.