ఏసీబీ వలలో సదాశివపేట మున్సిపల్​ ఆర్‌‌ఐ

ఏసీబీ వలలో సదాశివపేట మున్సిపల్​ ఆర్‌‌ఐ

సదాశివపేట, వెలుగు : సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఓ ఇంటికి నంబర్ ​ఇచ్చేందుకు లంచం అడిగిన మున్సిపల్​ ఆర్‌‌ఐ, అవుట్​సోర్సింగ్​ ఉద్యోగి ఏసీబీ వలలో చిక్కారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్​కుమార్​ కథనం ప్రకారం.. పట్టణంలోని సిద్దాపూర్​ హౌసింగ్​ బోర్డులో ఉన్న ఎకో వాల్యూ వెంచర్​లో ఓ వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు. 2023 సెప్టెంబర్​ 25న ఇంటి నంబర్ కావాలని మున్సిపల్​ ఆఫీసులో అప్లై చేసుకున్నాడు. దీనికి రూ.10వేలు ఇవ్వాలని ఆర్ఐ పతంగి వెంకట్​రావు అవుట్​సోర్సింగ్​ ఉద్యోగి వేణుగోపాల్​తో డిమాండ్​ చేయించాడు.

లంచం ఇచ్చే ఉద్దేశం లేకపోవడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బుధవారం బాధితుడి నుంచి ఆర్ఐ వెంకట్​రావు, వేణుగోపాల్ మున్సిపల్​ఆఫీసులో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అవినీతి నిరోధక చట్టం 7బి/12 సెక్షన్​ ప్రకారం కేసు నమోదు చేసి నిందుతులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ తెలిపారు. దర్యాప్తులో ఏసీబీ సీఐ వెంకట్​రాజ్​, ఇన్​స్పెక్టర్ ​రమేశ్​ పాల్గొన్నారు.