గతేడాది ‘విరూపాక్ష’ చిత్రంతో హిట్ను అందుకున్న సాయి ధరమ్ తేజ్ తాజాగా తన నెక్స్ట్ మూవీ సెట్లో జాయిన్ అయ్యాడు. రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభించగా.. శుక్రవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ను తెలియజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.
ల్యాండ్ మైన్లతో చుట్టుముట్టబడిన ఎడారి.. మధ్యలో పచ్చని చెట్టుతో ఉన్న పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘అతని రాక కోసం తహతహలాడుతున్న భూమి.. నరకం లోతుల నుంచి పైకి’ అని పోస్టర్పై క్యాప్షన్ ఉండటంతో ఇదొక యూనివర్సల్ కాన్సెప్ట్ మూవీ అని తెలుస్తోంది. సాయి తేజ్ నటిస్తున్న 18వ చిత్రమిది. ‘హనుమాన్’ ఫేమ్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇదొక పీరియాడికల్ యాక్షన్ డ్రామా. సాయి తేజ్ క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉంటుంది. ఈ చిత్రం కోసం ఓ భారీ సెట్ను నిర్మించాం. తొలి షెడ్యూల్ జరుగుతోంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం’ అని అన్నారు.