చంద్రబాబు అవినీతి కనిపెట్టింది జీఎస్టీ వాళ్లే.. అన్నీ తెలిసే డ్రామాలు : సజ్జల

చంద్రబాబు అవినీతి కనిపెట్టింది జీఎస్టీ వాళ్లే.. అన్నీ తెలిసే డ్రామాలు : సజ్జల

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో పారదర్శకంగా జరిగిన దర్యాప్తులో చంద్రబాబును అరెస్ట్ చేశారని ఏపీ ప్రభుత్ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబు అరెస్టులో ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు. 

తన అరెస్ట్ కు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ లేదు.. నోటీసులు లేదని టీడీపీ లేనిపోని ఆరోపణలు చేస్తోందని..అయితే కాగ్నిజబుల్ అఫెన్స్, ఆర్థిక నేరాల్లో నోటీసు ఇవ్వాల్సిన పనిలేదని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.  చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా రిలీజ్ చేసిన రూ.370 కోట్లలో రూ. 241 కోట్లు షెల్ కంపెనీల ద్వారా డైవర్ట్ అయినట్టు జీఎస్టీ ఇంటెలిజెన్స్ పేర్కొందని  ఆయన గుర్తు చేశారు.  

Also Read : చంద్రబాబు చేసిన అవినీతి ఏంటీ..? సీఎంగా ఉండి ఎలా చేశారు.. అరెస్ట్ కు ముందు విచారణ ఎలా సాగింది..!

చంద్రబాబుకు అన్ని తెలిసే  రెండు మూడు రోజుల నుంచి అరెస్ట్‌ గురించి ఆయన మాట్లడుతున్నారని సజ్జల విమర్శించారు.  ఇప్పుడు ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదంటూ దబాయిస్తున్నారని మండిపడ్డారు.  రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయంటూ చంద్రబాబు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని..కానీ  ఈ కేసు చాలా బలంగా ఉందని చెప్పారు. రాత్రికి రాత్రి జరిగింది కాదని... దాదాపు రెండేళ్ల కిందటే ఎఫ్‌ఆఐర్‌ నమోదు అయ్యిందని తెలిపారు.  

2021 డిసెంబర్‌లో(9-12-2021) సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.  కానీ   2017-18లోనే జీఎస్టీ డీఐజీ నేతృత్వంలోని బృందం..  రూ.241 కోట్లు డైవర్ట్‌ అయ్యిందని బయటపెట్టిందన్నారు.  ఎఫ్‌ఐఆర్‌ కంటే ముందే జీఎస్టీ నిఘాలో స్కామ్‌ బయటపడిందని... స్కాంలో అప్పటి సీఎం పాత్ర ఉందనే బలమైన సాక్ష్యాలు సీఐడీ దగ్గర ఉన్నాయన్నారు.  షెల్‌ కంపెనీల ద్వారా నిధులు తరలించారనే ఆరోపణలు ఉన్నాయని చెప్పారు.