ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో సూసైడ్​

ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో సూసైడ్​

హసన్​పర్తి, వెలుగు :  ఫైనాన్స్ కంపెనీ  సిబ్బంది  ఇంటికొచ్చి దౌర్జన్యం చేయడంతో  శనివారం   హనుమకొండ జిల్లా పలివేల్పుల గ్రామానికి సల్ల రాజా అంకుశ్​యాదవ్ (34) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.    కాకతీయ యూనివర్సిటీ  ఎస్ఐ రాజుకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజా అంకుశ్​​ యాదవ్  కూలి పనులు చేసేవాడు. నిరుడు  హనుమకొండ హంటర్ రోడ్​లోని   హిందూస్తాన్ ఫైనాన్స్ కంపెనీలో  తన భూమిని కుదువ పెట్టి  రూ.4లక్షలు అప్పు తీసుకున్నాడు.  

ప్రతీ నెల ఇన్​స్టాల్​మెంట్​ సక్రమంగా చెల్లించేవాడు.  ఈనెల ఇన్​స్టాల్​మెంట్​ కట్టడం ఆలస్యం కావడంతో  హిందూస్తాన్ ఫైనాన్స్  సిబ్బంది గురువారం రాజా అంకుశ్​ యాదవ్ ఇంటికి వచ్చి దౌర్జన్యం  చేశారు. దీంతో మనస్తాపం చెందిన రాజా అంకుశ్​​  ఫైనాన్స్  సిబ్బంది ముందే  తన ఇంటిలో ఉన్న గడ్డి మందు తాగాడు. అది గమనించిన  ఫైనాన్స్ సిబ్బంది అక్కడ నుంచి పారిపోయారు. వెంటనే స్థానికులు రాజా అంకుశ్​​ ను ట్రీట్​మెంట్​ కోసం ఎంజీఎం తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు.  మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు   కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.