హసన్పర్తి, వెలుగు : ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది ఇంటికొచ్చి దౌర్జన్యం చేయడంతో శనివారం హనుమకొండ జిల్లా పలివేల్పుల గ్రామానికి సల్ల రాజా అంకుశ్యాదవ్ (34) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కాకతీయ యూనివర్సిటీ ఎస్ఐ రాజుకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజా అంకుశ్ యాదవ్ కూలి పనులు చేసేవాడు. నిరుడు హనుమకొండ హంటర్ రోడ్లోని హిందూస్తాన్ ఫైనాన్స్ కంపెనీలో తన భూమిని కుదువ పెట్టి రూ.4లక్షలు అప్పు తీసుకున్నాడు.
ప్రతీ నెల ఇన్స్టాల్మెంట్ సక్రమంగా చెల్లించేవాడు. ఈనెల ఇన్స్టాల్మెంట్ కట్టడం ఆలస్యం కావడంతో హిందూస్తాన్ ఫైనాన్స్ సిబ్బంది గురువారం రాజా అంకుశ్ యాదవ్ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారు. దీంతో మనస్తాపం చెందిన రాజా అంకుశ్ ఫైనాన్స్ సిబ్బంది ముందే తన ఇంటిలో ఉన్న గడ్డి మందు తాగాడు. అది గమనించిన ఫైనాన్స్ సిబ్బంది అక్కడ నుంచి పారిపోయారు. వెంటనే స్థానికులు రాజా అంకుశ్ ను ట్రీట్మెంట్ కోసం ఎంజీఎం తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.