బీజేపీ పాలనలో అన్యాయం జరుగుతోంది

 బీజేపీ పాలనలో అన్యాయం జరుగుతోంది

మేడిపల్లి, వెలుగు: ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశ సమైక్యత, సమగ్రతకు పెద్ద ముప్పు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఏప్రిల్ 24 నుంచి 29 వరకు ‘బీజేపీ హఠావో..దేశ్ కో బచావో’ పేరుతో మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని మేడిపల్లి నుంచి జవహర్ నగర్ వరకు ఇంటింటికీ సీపీఐ ప్రజా చైతన్య యాత్ర సోమవారం ప్రారంభమైంది. పార్టీ మేడిపల్లి మండల కార్యదర్శి రచ్చ కిషన్  ఆధ్వర్యంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇందిరా నగర్ చౌరస్తాలో సాంబశివరావు పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ బీజేపీ పాలనలో అన్యాయం జరుగుతోందంటూ ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పడం అభ్యంతరకరమని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించకపోగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్య అవసర వస్తువుల ధరలు పెంచుకుంటూ పోతూ ప్రజల నడ్డివిరిస్తున్నారని విమర్శించారు.  ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల మల్లేశ్, పి.పద్మ, దళిత హక్కుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, జిల్లా కార్యదర్శి సాయిల్ గౌడ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్,  తదితరులు పాల్గొన్నారు.