ఇసుక బుకింగ్ లో .. మెసేజ్‌ల మాయాజాలం!

ఇసుక బుకింగ్ లో .. మెసేజ్‌ల మాయాజాలం!
  • తమకు అనుకూలమైన వారికి వెంటనే ఇసుక కేటాయింపు
  • లేదంటే 20 రోజులైనా వెయిట్​ చేయాల్సిందే
  • గద్వాల -మైనింగ్  ఆఫీసులో ఇష్టారాజ్యం

గద్వాల, వెలుగు: మైనింగ్​ ఆఫీస్​లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో అఫీషియల్​ రీచ్​ల నుంచి ఇసుక తెచ్చుకునేందుకు సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తమకు అనుకూలమైన వారికి వెంటనే ఇసుక జారీ చేస్తుండగా, ఇతరులకు మాత్రం రోజుల తరబడి ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతించక పోవడంతో ఇబ్బంది పడుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి సోమ, గురువారాల్లో ఇసుక బుకింగ్  కోసం సైట్​ను ఓపెన్​ చేయాలి. 

కానీ, ఆఫీస్​లోని కొందరు సిబ్బంది ఇసుక మాఫియాతో కుమ్మక్కై ఎప్పుడు పడితే అప్పుడు సైట్  ఓపెన్  చేసి ఇసుక బుకింగ్  చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇటీవల ఆదివారం కూడా సైట్  ఓపెన్ చేసిన సిబ్బంది, తమకు అనుకూలమైన వారికి సోమవారమే ఇసుక కేటాయిస్తూ మెసేజ్ లు పంపారు. దీంతో పాటు రాత్రి వేళల్లోనూ అఫీషియల్  రీచ్ ల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

మెసేజ్ ల మాయాజాలం..

వాస్తవంగా ఇసుక బుక్  చేసిన వెంటనే సంబంధిత వ్యక్తికి పలానా రోజు ఇసుక వస్తుందని సమాచారం వెళ్తుంది. కానీ, ఇసుక బుక్  చేసిన వారిలో కొందరికి మెసేజ్ లు రోజుల తరబడి వెళ్లడం లేదు. మైనింగ్​ ఆఫీస్​లో పని చేసే కొందరు సిబ్బంది ఇసుక కేటాయింపు వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తూ ఇసుక వ్యాపారులతో దందా చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇక మైనింగ్  ఆఫీసులో ప్రతి పనికీ ఓ రేట్​ ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

కొత్త మన ఇసుక వాహనం పెట్టడానికి రూ.25 వేలు చెల్లించాల్సి ఉండగా, రూ.35 వేలు వసూలు చేస్తున్నారు. వివిధ కారణాలతో ట్రాక్టర్  అకౌంట్​ మార్పు చేసుకోవాల్సి వస్తే, ఫ్రీగా చేయాల్సిన అధికారులు రూ.3 నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారని ట్రాక్టర్  ఓనర్లు వాపోతున్నారు. మన ఇసుక వాహనం హోల్డ్ లో ఉంటే దానిని అన్  హోల్డ్  చేయడానికి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 500 మన ఇసుక వాహనాలు ఉన్నాయి. ప్రతి రోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లకు ఏదో ఒక రిమార్క్​ పెట్టి, డబ్బులు వసూలు చేస్తున్నారని అంటున్నారు.

అక్రమంగా ఇసుక తరలింపు..

అఫీషియల్  రీచ్ ల వద్ద రాత్రి వేళల్లో కాపలా ఉండదు. దీనిని ఆసరా చేసుకుంటున్న కొందరు రాత్రి వేళల్లో టిప్పర్లు, జేసీబీలతో ఇసుకను తమకు అనుకూలమైన ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని తూర్పు గార్లపాడు, మద్దూరు, మెన్నిపాడు, అలంపూర్, పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, కేశవరం, వేణి సోంపురం గ్రామాల్లో ఆఫీషియల్ రీచ్ లు ఉన్నాయి. ఈ రీచ్ ల నుంచి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా రాత్రివేళల్లో అక్రమంగా ఇసుకను తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. గద్వాల, అలంపూర్  తదితర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో టిప్పర్లతో ఇసుక తరలించి డంప్  చేస్తున్నారు. వాటిని ఎక్కువ రేట్​కు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.

మెసేజ్ లపై దృష్టి పెడతాం..

ఇసుక బుకింగ్  మెసేజ్ లపై దృష్టి పెడతాం. ఇసుక బుక్  చేసుకున్నా, మెసేజ్​ రాని వారు తమకు కంప్లైంట్  చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఆదివారం సైట్  ఓపెన్  చేసిన వ్యవహారంపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటాం.

రమణ, మైనింగ్  ఏడీ, గద్వాల