ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

సంగారెడ్డి జిల్లా నల్లంపల్లిలో ఘటన 

రాయికోడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో ఓ భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణం తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయికోడ్ మండలం నల్లంపల్లికి చెందిన మొట్కె కృష్ణ(35) భార్య.. అదే గ్రామానికి చెందిన ప్రశాంత్​తో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. కొన్నాళ్ల కింద విషయం తెలుసుకున్న కృష్ణ పలుమార్లు భార్యను మందలించాడు. ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఇటీవల పుట్టింటికి పంపించాడు. దీంతో కృష్ణపై.. ప్రశాంత్​కక్ష పెంచుకున్నాడు.

15 రోజుల కింద ఫుల్లుగా తాగొచ్చి కృష్ణతో గొడవపడ్డాడు. గురువారం రాత్రి సరుకుల కోసం షాపుకు వెళ్తున్న కృష్ణను ప్రశాంత్ గమనించాడు. కారం, ఇనుప రాడ్, బీర్​సీసా ​తీసుకుని వెంబడించాడు. ఒక్కసారిగా కృష్ణ కళ్లలో కారం చల్లి, బీర్​సీసా, ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని సీఐ, ఎస్సై పరిశీలించారు. మృతుడి తల్లి నర్సమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి బాబు, పాప ఉన్నారు.