ఆమె పట్టుదల నాకు స్ఫూర్తినిచ్చింది : ఆనంద్ మహీంద్రా

ఆమె పట్టుదల నాకు స్ఫూర్తినిచ్చింది : ఆనంద్ మహీంద్రా

ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‭గా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక స్పూర్తిదాయక విశేషాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నుంచి తాను ప్రేరణ పొందానని.. ఆమె కెరీర్ తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. టెన్నిస్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సమయంలో సానియా మాట్లాడిన చివరి సందేశాన్ని ఆయన ట్విట్టర్‭లో షేర్ చేశారు. 

ఆస్ట్రేలియా ఓపెన్‌ టోర్నీలో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఫైనల్‌ వరకు వెళ్లి ఓటమి పాలైన సానియా తన టెన్సిస్ కెరీర్ ను ముగించింది. ‘‘పోటీతత్వం అనేది నా రక్తంలోనే ఉంది. ఎప్పుడు కోర్టులో అడుగుపెట్టినా గెలవాలనే ఆడుతా. అది చివరి గ్రాండ్‌స్లామ్‌ అయినా లేదా చివరి సీజన్‌ అయినా సరే..!’’ అని సందేశాన్ని ఇచ్చింది. ఈ సందేశాన్ని ఆనంద్‌ మహీంద్రా తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘‘సానియా తన కెరీర్‌ను ఎలా ప్రారంభించిందో అలాగే ముగించిందని మహీంద్రా చెప్పారు. విజయం సాధించాలనే పట్టుదల ఆమెలో ఏ మాత్రం తగ్గలేదన్న ఆయన.. కెరీర్‌లో ప్రతి దశలో రాణించాలన్న కోరికను తనలో సజీవంగా ఉంచుకునేలా ఆమె జీవితం గుర్తుచేసిందని అన్నారు. సానియానే తన మండే మోటివేషన్‌’’ అని ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు.