- ప్రవల్లిక సూసైడ్ను తప్పుదోవ పట్టిస్తరా?: కేసీఆర్పై సంజయ్ ఫైర్
- నిరుద్యోగులారా.. బీఆర్ఎస్ సర్కార్కు వ్యతిరేకంగా ప్రచారం చేయండి
హైదరాబాద్/కరీంనగర్, వెలుగు: ప్రవల్లికది లవ్ ఫెయిల్యూర్ అంటూ పోలీసులతో అబద్ధాలు చెప్పించారని సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బిడ్డను కోల్పోయి ప్రవల్లిక కుటుంబం కన్నీరుమున్నీరవుతుంటే.. ఆమెది లవ్ ఫెయిల్యూర్ అంటూ అబద్ధాలు చెప్పడం దారుణమని మండిపడ్డారు. ‘‘ప్రవల్లిక మృతి కంటే పోలీసులు ఇచ్చిన స్టేట్ మెంట్తోనే ఆమె కుటుంబ సభ్యులు ఎక్కువ బాధపడుతున్నారు. ప్రవల్లిక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరీక్షలు పోస్ట్ పోన్ అవుతున్నాయని చెప్పింది.
తన కోసం ఎంతో కష్టపడ్డారని తల్లిదండ్రులతో చెప్పుకుంటూ బాధపడ్డది. ప్రవల్లిక సూసైడ్ ను తప్పుదోవ పట్టించడం దారుణం. నిజంగా ప్రేమ వ్యవహారమే కారణమైతే ఆధారాలు ఎందుకు బయటపెట్టడంలేదు” అని ప్రశ్నించారు. నిరుద్యోగులంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం ఈ కేసును తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.
శనివారం హైదరాబాద్లో, కరీంనగర్లో సంజయ్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్పందించని కేసీఆర్.. సిగ్గు లేకుండా మరోసారి అవకాశం అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ప్రవల్లికకు న్యాయం జరగాలని యువత కదలివచ్చింది. ప్రభుత్వం వారిపై లాఠీచార్జ్ చేయించింది. మా పార్టీ ఎంపీ లక్ష్మణ్ను అరెస్టు చేశారు” అని మండిపడ్డారు.
‘‘రాష్ట్రంలోని 50 లక్షల మంది నిరుద్యోగులకు చేతులు జోడించి అడుగుతున్న.. 50 రోజులు మీ గ్రామాలకు వెళ్లండి. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయండి. కేసీఆర్ ప్రభుత్వ అరాచకాలను వివరించి బీజేపీకి ఓటేసేలా చూడండి” అని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఆ బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే..
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చడం పెద్ద విషయం కాదని సంజయ్ అన్నారు. ‘‘మీకు చేతులు జోడించి అడుగుతున్న.. 50 రోజులు కొట్లాడండి.. బీజేపీకి అండగా నిలవండి. నవంబర్ 30 కేసీఆర్కు డెడ్ లైన్ కావాలి. కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేయాలి. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా.. అంబేద్కర్ రాజ్యాంగం కావాలా.. ఆలోచించుకోండి” అని అన్నారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. కర్నాటకలో రూ.40 కోట్లు దొరికాయి. తెలంగాణ ఎన్నికల కోసం వాటిని తరలించాలనుకున్నారు.
బోరబండలో బీఆర్ఎస్ నేత ఇంట్లో డ్రగ్స్ దొరికాయి. ఎన్నికల కోసమే విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అందిస్తున్నారు” అని ఆరోపించారు. ‘‘3+3=6.. బీఆర్ఎస్ ఇంటికి పోవడం ఫిక్స్. గత పార్లమెంట్ ఎన్నికల్లో కారు షెడ్డుకు, సారు ఫామ్ హౌస్కు పోయిన్రు. 16 ఎక్కడ పోయిందో వారికే తెలియాలి” అని ఎద్దేవా చేశారు.
పాక్ జెండాలు అమ్ముతుంటే ఏం చేస్తున్నరు?
పాకిస్తాన్ పై ఇండియా గెలుపొందిన సందర్భంగా శనివారం రాత్రి కరీంనగర్ లో బీజేపీ కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లోని షాపింగ్ మాల్స్ లో పాకిస్తాన్ జెండాలు విక్రయిస్తున్నారనే వార్తలపై స్పందించారు. ‘‘షాపింగ్ మాల్స్ అడ్డాగా లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతులను మోసం చేసే కుట్రలకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నారు?
తక్షణమే ఆ షాపింగ్ మాల్స్ ను మూసివేయాలి. లేని పక్షంలో ఉరికించి ఉరికించి కొడతాం” అని హెచ్చరించారు. ‘‘కొందరు ఫాల్తుగాళ్లు పాకిస్తాన్ గెలవాలని కోరుకుంటున్నారు. గతంలో కరీంనగర్ లో ఇట్లనే నల్ల జెండాలు పట్టుకుని తిరిగితే వీపంతా సాఫ్ చేసినం” అని అన్నారు.