శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. శివసేన పార్టీ పేరు, గుర్తు కొనుగోలు చేసేందుకు రూ. 2000 వేల కోట్ల ఒప్పందం జరిగిందని ఆరోపించారు. ఇది కేవలం ప్రాథమిక అంచానా మాత్రమేనని.. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. దేశ చరిత్రలోనే ఇలా మునుపెన్నడూ జరగలేదని అన్నారు.
ఈ డీలింగ్ కు సంబంధించి గత ఆరు నెలలుగా లావాదేవీలు జరుగుతున్నాయని.. ఇప్పటి వరకు రూ. 2000 వేల కోట్లు( షిండే వర్గంలోని ఒక్కో 40 మంది ఎమ్మెల్యేలకు 50 కోట్ల చొప్పున) చేతులు మారాయని సంజయ్ రౌత్ ఆరోపించారు. ఇది వంద శాతం నిజమని..దేశ చరిత్రలో ఇలా మునుపెన్నడూ జరగలేదన్నారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయంటూ సంజయ్ రౌత్ ఆదివారం ట్వీట్ చేశారు. అయితే ఈ ఆరోపణలను షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే సధా సర్వాంకర్ ఖండించారు. సంజయ్ రౌత్ ఏమన్నా క్యాషియరా? అని కామెంట్ చేశారు.
ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి ఎన్నికల సంఘం శుక్రవారం శివసేన అనే పార్టీ పేరును, విల్లు-బాణం గుర్తును కేటాయించింది.