సరళాసాగర్​కు గండి ఒక టీఎంసీ నీరు ఏటిపాలు

సరళాసాగర్​కు గండి  ఒక టీఎంసీ నీరు ఏటిపాలు

ముందే హెచ్చరికలు ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం

    4200 ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకం

    ఆందోళనలో రైతులు

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని  సరళాసాగర్​ ప్రాజెక్టుకు మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గండి పడి, అందులోని ఒక టీఎంసీ నీరు వృథాగా పోయింది.​ ఎర్త్ డ్యామ్​నుంచి చిన్నగా మొదలైన నీటి ప్రవాహం ఆ తర్వాత ఉధృత రూపం దాల్చి కట్టకు పెద్ద గండిపెట్టింది. ఈ నీరంతా రామన్​పాడు రిజర్వాయర్​లోకి వెళ్లడంతో అక్కడి ఆఫీసర్లు అలర్ట్​ అయ్యారు. ప్రాజెక్టు గేట్లను ఎత్తి కృష్ణానదిలోకి  వదిలేశారు. ఈ రిజర్వాయర్ కింద 4200 ఎకరాల ఆయకట్టు ఉండగా, నాట్లు వేసేందుకు నారు పోసుకున్న రైతుల ఆశలు ఆవిరయ్యాయి. కాగా, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆఫీసర్లు తెలిపారు.

అరుదైన ప్రాజెక్టు

సరళాసాగర్​ ఆసియా ఖండంలో మొదటి సైఫన్​సిస్టం గల ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. రిజర్వాయర్​లో నీరు ఫుల్​ కెపాసిటీకి చేరగానే గాలిపీడనంతో గేట్లు ఆటోమేటిక్​గా తెరుచుకుంటాయి. వనపర్తి సంస్థానాధీశులు తమ పేరు ప్రఖ్యాతులు ప్రపంచానికి చాటాలనే ఉద్దేశంతో ఈ తరహా సాంకేతికత జోడించారు. 1948లో నిజాం ప్రభుత్వ హయాంలో దీనిని పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. వర్షాధార ప్రాజెక్టుగా ఉండడం వల్ల ఐదారేళ్లకోసారి  కూడా నిండేది కాదు. 2004లో  వైఎస్​ రాజశేఖర్​రెడ్డి హయాంలో దీనికి రూ. 13 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయడంతో నాటి నుంచి ఆయకట్టుకు సాగునీరు అందుతోంది.

నిర్వహణ గాలికి..

ఉమ్మడి ఏపీలో సరళాసాగర్​ప్రాజెక్టు నిర్వహణను చాలా ఏండ్లుగా గాలికి వదిలేశారు. ప్రాజెక్టుకు కనీస మరమ్మతులు చేపట్టలేదు. తెలంగాణ ఏర్పాటుతోనైనా ఈ ప్రాజెక్టుకు మంచి రోజులు వస్తాయని రైతులు భావించినప్పటికీ టీఆర్ఎస్​ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో పైసా కూడా విదల్చలేదు. దీంతో మట్టికట్టపై చెట్లు మొలిచి బలహీనమవుతూ వచ్చింది. డ్యామ్​ నిర్మించి 70 ఏళ్లు దాటడంతో గచ్చుతో నిర్మించిన గోడలు నెర్రెలు బారాయి. కొద్ది నెలలుగా లీకేజీలు బయటపడుతున్నాయి.

ప్రాజెక్టు తెగడం దురదృష్టకరం

సరళాసాగర్​ప్రాజెక్టుకు గండి పడి నీరంతా బయటికి పోవడం దురదృష్టకరమని,  ప్రాణ నష్టం, పంట నష్టం జరగలేదని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్​ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి  చెప్పారు. మంగళవారం ఉదయం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డితో కలిసి గండిని పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మించి చాలాకాలం కావడం వల్లే కట్ట తెగి పోయిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి రైతులను ఓదార్చారు. ప్రాజెక్టు కింద సాగుకు సిద్ధమైన రైతులు నాట్లు వేసుకునేందుకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని అందిస్తామని చెప్పారు. ప్రాజెక్టును తిరిగి నిర్మించేందుకు ఇంజినీర్లతో సంప్రదింపులు చేపడుతామన్నారు. ఆయన వెంట వనపర్తి జిల్లా కలెక్టర్​ శ్వేతా మహంతి, ఎస్పీ అపూర్వరావు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి ఉన్నారు.

ప్రభుత్వం స్పందించలేదు చిన్నారెడ్డి, మాజీ మంత్రి

సరళాసాగర్ లీకవుతున్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే  కట్ట తెగిందని మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత చిన్నారెడ్డి విమర్శించారు. సరళాసాగర్​ గండిని పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. భారీ నీటి ప్రాజెక్టుల పేరిట కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్న తెలంగాణ ప్రభుత్వం, చిన్న తరహా నీటి ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేసిందన్నారు. డిసెంబర్​ 24న కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేయాల్సి ఉన్నా మదనాపురం అధికార పార్టీ జడ్పీటీసీ గోవాకు విహార యాత్రకు వెళ్లడంతో కాంగ్రెస్​ మాజీ జడ్పీడీసీ బాలమణెమ్మ ప్రాజెక్టు వద్ద నిరసన తెలిపి, తూములు తెరిచారని గుర్తు చేశారు.

హెచ్చరించిన ‘వెలుగు’

సరళాసాగర్​ ప్రాజెక్టుకు లీకేజీలు ఏర్పడ్డాయని, వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే ముప్పు తప్పదని ‘వెలుగు’ దినపత్రిక ముందే హెచ్చరించింది. ఈ మేరకు అక్టోబర్​ 23న ‘సరళాసాగర్​కు లీకేజీలు.. రైతుల ఆందోళన’ పేరుతో ప్రత్యేక కథనం ప్రచురించింది. కానీ ఇరిగేషన్​ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులుగానీ పట్టించుకోలేదు. దీంతో నాటి చిన్న లీకేజీలు పెద్దవై గండి పడి నీరంతా వృథాగా పోయింది. ఇటీవలే ప్రాజెక్టులో మత్స్యకారులు చేపపిల్లలు వదిలారు. రైతులు నార్లు పోసుకున్నారు. ప్రాజెక్టు ఖాళీ కావడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు.