
Zepto Cafe: ఇటీవలి కాలంలో ప్రజల జీవితాలు ఎంత స్పీడుగా మారిపోయాయంటే కనీసం 2 నిమిషాల్లో చేసుకునే మ్యాగీ కూడా కొనుక్కుని తినేంతలా. పైగా దీనికి తోడు 10 నిమిషాల్లో కోరిన స్నాక్స్ డెలివరీ ఇచ్చేస్తామంటూ క్విక్ కామర్స్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో క్వాలిటీ అనే మాటకు చోటు దొరకటం లేదేమో అనిపిస్తోంది కొన్ని ఘటనలు చూస్తుంటే. తయారు చేసే చోటు ఎలా ఉన్నా తెచ్చిచ్చినప్పుడు చూడటానికి నీట్ గా ఉండటంతో కొనుక్కుంటున్నోళ్లు మోసపోతున్నారు.
గతవారమే జెప్టో గోదాములో కుళ్లిన, పాడైన వస్తువులు దొరకటంతో వార్తల్లో నిలిచిన క్విక్ కామర్స్ కంపెనీ నేడు మళ్లీ తెరమీదకు వచ్చింది. తాజాగా ఒక కస్టమర్ జెప్టో కేఫ్ నుంచి స్నాక్స్ కోసం సరదాగా మ్యాగీ నూడిల్స్ ఆర్డర్ చేసింది. 10 నిమిషాల్లో తినటానికి వీలుగా స్నాక్స్ సేవలను అందిస్తున్న జెప్టో కేఫ్ నుంచి కొన్న మ్యాగీలో చచ్చిన చీమలు చూసిన కస్టమర్ షాక్ అయ్యింది. కొంచెం తిన్న తర్వాత మ్యాగీ బౌల్ చివరికి వెళుతుంటే అడుగున చచ్చిన చీమలు ఉండటం చూసి ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది సదరు కస్టమర్.
బై 1 గెట్ 1 అంటూ ఆఫర్లతో కంపెనీ ఇప్పటికీ సేవలను ఎలా అందిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రిమికీటకాలతో కూడిన ఆహారాన్ని ఎలా అమ్ముతున్నారు, ఇదరు న్యాయం కాదంటూ జెప్టోను కూడా తన పోస్టులో ట్యాగ్ చేసింది. కంపెనీ క్వాలిటీ, శుభ్రత కంటే వేగంగా డెలివరీకే ప్రాధాన్యత ఇస్తోందంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన కంపెనీ తాము క్వాలిటీకి ప్రదమ ప్రాధాన్యం ఇస్తామని, ఏదైనా పొరపాటు వల్ల ఇబ్బంది కలిగితే క్షమించాలని కోరింది. అయితే తాము తిన్నదానిలో చీమలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది బొద్దింకలు ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. అయితే దీనిపై స్పందించిన కంపెనీ తమకు డబ్బులు రిఫండ్ ఇచ్చిందని సదరు యూజర్ వెల్లడించారు.
మెున్న ముంబై ధారావీ గోదాములో చేసిన అధికారుల సోదాల్లో పాడైన వస్తువులు, బూజు పట్టిన వస్తువులు వచ్చిన తర్వాత ఈ విషయం వెలుగులోకి రావటం యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది. కంపెనీ తన గోదాముల్లో సరుకుల భద్రత, నాణ్యతపై ఫోకస్ పెంచాల్సిన అవసరం ఉందని ప్రస్తుత ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి. ఫుడ్ అధికారులు ధారావీలోని గోదాము లైసెన్స్ ఇప్పటికే రద్దు చేసిన సంగతి తెలిసిందే.