మన రూ.5 పార్లేజీ బిస్కెట్.. ఇప్పుడు అక్కడ 2 వేల 300 : యుద్ధ భూమిలో బిడ్డ ప్రాణాల కోసం తండ్రి పోరాటం

మన రూ.5 పార్లేజీ బిస్కెట్.. ఇప్పుడు అక్కడ 2 వేల 300 : యుద్ధ భూమిలో బిడ్డ ప్రాణాల కోసం తండ్రి పోరాటం

ఒక యుద్ధం ఇద్దరి నేతల అహంకారం నుంచి పుట్టినప్పటికీ దాని ఫలితం లక్షల మంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. కానీ యుద్ధం దూరం నుంచి చూసేవారికంటే అక్కడ దానిని భరిస్తు్న్నవారికి తెలుసు ఆ కష్టాలు. తాజాగా గాజాలో జరుగుతున్న యుద్ధంలోని ధీనగాథ అందరినీ కలిచివేస్తోంది.

పార్లేజీ బిస్కెట్ అనగానే అందరికీ స్నాక్స్ లేదా టీటైమ్ లో గుర్తుకొచ్చే సరసమైన ధరలో లభించే బిస్కెట్ ప్యాకెట్. అనేక సంవత్సరాల నుంచి కంపెనీ దాని రేటును మాత్రం మార్చకుండా కొనసాగించటానికి కారణం దానిని అందుబాటు ధరకు ఉండేలా చేయటం. కానీ గాజా యుద్ధ భూమిలో మాత్రం దీని ధరలు రెక్కలొచ్చేశాయి. అక్కడ ఇదొక లగ్జరీ వస్తువు కంటే ఎక్కువ ధర పలకటం అందరినీ ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తోంది. 

 

ఇండియాలో ఒక పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ రేటు రూ.5 కానీ దానిని తమకు ఒక్కోటి రూ.2వేల 342కి విక్రయిస్తున్నారంటూ గాజా యుద్ధ భూమిలో నివసిస్తు్న మెుహమద్ జవాద్ అనే పాలస్తీనియన్ తండ్రి పెట్టిన పోస్ట్ షాక్ కి గురిచేస్తోంది. ఒకప్పుడు దానిని కేవలం రూ.146కి విక్రయించేవారని చెప్పాడు. తన పిల్లవాడికి అది ఎంతో ఇష్టమైనదని అయితే ధరలు మండిపోవటంతో బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనివ్వలేని స్థితిలోకి తాము వెళ్లిపోతున్నట్లు చెప్పుకొచ్చాడు. 

వాస్తవానికి భారత్ ఈ పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లను యుద్ధం భూమిలోని పాలస్తీనా ప్రజలకు సహాయం రూపంలో పంపుతోంది. కానీ అక్కడి హమాస్ ఉగ్రవాదులు ఆ ట్రక్కుల్లోని ఆహారాన్ని, మందులను అడ్డుకుని వాటిని బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేట్లకు అమ్మటంతో ప్రజలకు కనీస అవసరాలు సైతం తీర్చుకోలేని స్థితికి వెళ్లిపోయారు. కొందరు ఈ సహాయం గాజా ప్రజలకు సక్రమంగా చేరుతోందని అనుకుంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నట్లు తాజాగా మెుహమద్ చేసిన పోస్ట్ వెల్లడించింది.

 

అక్కడ పిండి ధర రూ.42వేల 500, చక్కెర కేజీ ధర రూ.7వేల 650కి చేరుకున్నాయని తన ఎక్స్ పోస్టులో వెల్లడించాడు. తమ వద్ద కలలో కూడా ఊహించని రేట్లకు వస్తువులను అమ్ముతున్నారని.. చాలా మంది ఈ పరిస్థితుల్లో కనీస అవసరాలను కూడా తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు చెప్పాడు. ఇదే సమయంలో మరికొందరు వస్తువులను దొంగిలించి భారీ లాభాలకు విక్రయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.